స్పీడ్ న్యూస్ 1
posted on Jul 17, 2023 @ 9:48AM
1.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం శ్రీవారిని 86 వేల 170 మంది దర్శించుకున్నారు. 31 వేల 128 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
...........................................................................................................................................................
2. దొంగలు ఏటీఎంలో ఏసీని దోచుకెళ్లినఇ సంఘటన పంజాబ్ లోని బాఘ్ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఓ ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం ఇద్దరు దొంగలు ఏటీఎంలో అమర్చిన ఏసీని దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు వైరల్ అవుతున్నాయి.
............................................................................................................................................................
3.పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లోని కాష్మోరే ప్రాంతంలోగల ఓ హిందూ దేవాలయంపై కొందరు దోపిడీ దారులు రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో రాకెట్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
............................................................................................................................................................
4. రంగారెడ్డి జిల్లా బూర్గుల శివారులోగల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో ఆదివారం సంభవించిన పేలుడులో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ సిలెండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది.
............................................................................................................................................................
5. విమానం గాల్లో ఉండగానే పైలట్ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఓ ప్రయాణీకురాలే విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు. శనివారం అమెరికాలోని విన్యార్డ్ ఎయిర్పోర్టులో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.
............................................................................................................................................................
6. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. రైలులోని సీ-14 కోచ్ వద్ద మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి.
............................................................................................................................................................
7. మంత్రి కేటీ రామారావుకు బెర్లిన్ నగరంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానం అందింది. ప్రపంచ నిపుణులతో కూడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ మంత్రి కేటీఆర్ను ఆహ్వానించింది.
............................................................................................................................................................
8. మేడ్చల్ జిల్లా దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బహదూర్ పల్లి సమీపంలోని టెక్ మహీంద్ర వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యువరాజు, నాయుడుగా గుర్తించారు.
............................................................................................................................................................
9. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం తిరుపతికి రానున్నారు. జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్పై ఆయన తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. ............................................................................................................................................................
10. ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పాక్ లో గోధుమ పిండి ధర రికార్డు స్థాయిలో 320 రూపాయలకు చేరిందని పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.