Read more!

చివరి షెడ్యూల్ లో 'స్కై'.. ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది?

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్, రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ పై నాగిరెడ్డి గుంటక-మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'స్కై'. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. సుప్రసిద్ధ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఈ చిత్రానికి పని చేస్తుండడం విశేషం.

"ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బ్రతకాల్సి వస్తే, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం తుంటరిగా పక్కవాడ్ని మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడా? అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది? మనిషిని ఎలా మలుస్తుంది? అనేది క్లుప్తంగా 'స్కై' చిత్రం కథాంశమని.. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ 'స్కై' చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అని దర్శకుడు పృథ్వి తెలిపారు.

చివరి షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయనున్నామని, తెలుగువారంతా గర్వపడే చిత్రంగా 'స్కై' చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సమాంతరంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి మాటలు మురళీ కృష్ణంరాజు - పృథ్వి పేరిచర్ల అందిస్తుండగా, శివ సంగీతం సమకూరుస్తున్నారు.