Read more!

పవన్ కళ్యాణ్ తో షర్మిల ఢీ..!

 

పవన్ కళ్యాణ్ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై చేస్తున్న విమర్శలతో ఊక్కిరిబిక్కిరి అవుతున్న వైకాపాను ఆదుకోవడానికి మళ్ళీ షర్మిలే ముందుకు వచ్చారు. ఆమె కూడా పవన్ కళ్యాణ్ కు అంతే ధీటుగా బదులిస్తూ, ఆయన ఆలోచనలకి,మాటలకి, చేతలకి ఎక్కడా పొంతన ఉండదని విమర్శించారు. పార్టీ పెట్టినప్పుడు మీకు నచ్చిన వారికే ఓట్లు వేసుకోమని ప్రజలకు ప్రభోదించిన ఆయన, ఆ తరువాత మోడీకి, ఇప్పుడు చంద్రబాబుకి ఓట్లు వేయమని అడగడమే అందుకు నిదర్శనమని అన్నారు. గత ఎన్నికలలో చంద్రబాబుని తీవ్రంగా వ్యతితిరేఖించిన ఆయన ఈసారి ఎన్నికలలో చంద్రబాబుకి ఓటేయమని ఏ మొహం పెట్టుకొని ప్రజలను అడుగుతున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చివాడిలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ, ఊగిపోతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, అటువంటి పిచ్చోడు చెప్పిన మాటలు విని, ఆయన చెప్పిన అభ్యర్ధులకు మీరు ఓట్లు వేస్తారా? అని ప్రజలను అడిగారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొత్తగా పెళ్ళయిన జంటలా రాసుకుపూసుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు.

 

చంద్రబాబు ఎన్నికలలో గెలిచేందుకు మోడీని, వెంకయ్య నాయుడిని వెంటతెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించక పోయినా, ఆయన వెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోందని షర్మిల అన్నారు. హిందూపురం నుండి పోటీ చేస్తున్న బాలకృష్ణకు ఏవిధంగా మతిస్థిమితం లేదో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మతి స్థిమితం లేదని ఆమె ఎద్దేవా చేసారు. అటువంటి మతిస్థిమితం లేని వ్యక్తులు చెపుతున్న మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ఆనక వారే తీవ్రంగా నష్టపోతారని ఆమె హెచ్చరించారు.