వైసీపీ నేతల బెదిరింపులు! భయంతో యువకుడు సూసైడ్
posted on Feb 25, 2021 7:42AM
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. పంచాయితీలు మాత్రం ఆగడం లేదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డుకు బూత్ ఏజెంట్గా పనిచేసిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో రాజకీయ రచ్చ జరుగుతోంది.
తూర్పుగోదావరి జిల్లా అల్లవరం రూరల్ మండలం నడిపూడి గ్రామంలోని మెట్టరాంజీ కాలనీకి చెందిన రవిశంకర్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా 11వ వార్డుకు ఓ పార్టీ తరపున బూత్ ఏజెంట్గా పనిచేశాడు.పోలింగ్ సమయంలో వైసీపీ నేతలు కొందరు రిగ్గింగుకు పాల్పడ్డారని, అడ్డుకోబోయిన తనను చంపేస్తామని బెదిరించారని ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ లేఖలో రవిశంకర్ ఆరోపించారు. ఆ తర్వాత కూడా వారి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. తన ఆత్మహత్యకు వారే కారణమన్నాడు. రవి తల్లిదండ్రులు కూడా కుమారుడి ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.