ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
posted on Nov 7, 2023 @ 11:35AM
ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం(నవంబర్ 7) ప్రారంభమైంది. పోలింగ్ బూత్లకు వచ్చే వోటర్లు పెరుగుతున్నారు. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో ఓటింగ్ జరుగుతుండగా.. ఛత్తీస్గఢ్లో 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయమే పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
చత్తీస్ గడ్ లో మొత్తం 223 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో 25 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఫేజ్ లో 13 స్థానాలు ఎస్సీ, ఎస్టి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఫేజ్ లో కాంగ్రెస్ పార్టీ 6గురు సిట్టింగ్ లకే మళ్లీ అవకాశం కల్పించారు. రాజ్ నందగాన్ నుంచి మాజీ ముఖ్యమంత్రి రామన్ సింగ్ కాంగ్రెస్ నేత గిరిస్ దేవాన్ గన్ పై పోటీ చేస్తున్నారు. కొంట స్థానం నుంచి చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి కవాసి లక్మా పోటీ చేస్తున్నారు. ఆయన 2018, 2013 ఎన్నికల్లో కొంటా స్థానం నుంచి గెలుపొందారు. కొండగాన్ నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మోహన్ మార్కం పోటీ చేస్తున్నారు. నారాయణ్ పూర్ నుంచి మాజీ మంత్రి కేడర్ కాశ్యప్ బిజెపి తరపున పోటీ చేస్తున్నారు. కేశ్ కల్ నుంచి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. కవర్ధ స్థానం నుంచి 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఛత్తీస్గఢ్లో భారీ భద్రత
ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోని తెలంగాణలో నక్సలైట్ల సమస్య ఉండేది . ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతోంది. కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించాయి మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ బూత్లకు ఎక్కువగా చేరుకుంటున్నారు. కాగా మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పెద్ద సంఖ్యలో పోలీసు, ప్రత్యేక బలగాలను మోహరించింది. నక్సల్స్ ఇటీవలే బీజేపీ నేతను హత్య చేసిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కొనసాగుతున్న 20 నియోజకవర్గాల్లో 12 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఒక్క బస్తర్ జిల్లాలో ఏకంగా 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా నక్సల్స్ కదలికలపై నిఘా కూడా పెట్టారు.
మిజోరంలో మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895గా ఉంది. వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, 1 ట్రాన్స్జెండర్ ఉన్నారని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు మాత్రం డిసెంబర్ మూడో తేదీ వెల్లడవుతాయి.