మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు! కేసీఆర్ సర్కార్ లో కలకలం
posted on Dec 8, 2020 @ 2:46PM
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. దిండిగల్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై భూ కబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని సర్వే నెంబర్ 115, 116, 117లోని తనకు సంబంధించిన భూమిని అమ్మాలంటూ మంత్రి మల్లారెడ్డి అనుచరుల చేత బెదిరింపులు చేస్తున్నారని శ్యామల అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం 2 ఎకరాల 13 గుంటల భూమిలో ఇప్పటికే 20 గుంటల భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు కోర్టులో పిటిషన్ వేయడానికి నియమించుకున్న లాయర్ ను కూడా మంత్రి కొనేశారని ఆరోపించింది. మంత్రికి అమ్ముడుపోయిన లాయర్ నకిలీ అగ్రిమెంట్ను సృష్టించాడని మహిళ చెప్పింది. దిక్కుతోచని స్థితిలో పోలీసులు ఆశ్రయించినట్టు శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి మరో ఐదుగురిపై సెక్షన్ 446,506r/w, 34 ఐపీసీ సెక్షన్ల కింద దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.