జగన్ సర్కార్ హ్యాండ్సప్! చిక్కుల్లో పోలవరం ప్రాజెక్ట్
posted on Mar 21, 2021 @ 1:01PM
అన్నకున్నట్లే జరుగుతోంది. ప్రజలు భయపడుతున్నట్లే జరుగుతోంది. జగన్ రెడ్డి సర్కార్ చేతగానితనంలో ఆంధ్రప్రదేశ్ కు మోసాల మీద మోసాలు చేస్తూనే ఉంది కేంద్రం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ ప్రజలు భగ్గుమంటున్న సమయంలోనే మరో షాకిచ్చింది మోడీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కోత పెట్టేందుకు సిద్ధమైంది.
పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లకు మించి ఇవ్వొద్దంటూ కేంద్ర జల వనరులశాఖకు కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానం మేరకు ఆ మొత్తానికే పరిమితం కావాలని తేల్చి చెప్పింది. కేంద్ర జల వనరులశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.55,656.87 కోట్ల తుది అంచనా వ్యయంపై కేంద్రం స్పందించలేదు.
పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు రూ.5,035.05 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.7,278.85 కోట్లు, హెడ్వర్క్స్కు రూ.8,818.21 కోట్లు, కుడి ప్రధాన కాలువ రూ.1,885.43 కోట్లు, ఎడమ ప్రధాన కాలువ రూ.2,373.07 కోట్లకే పరిమితం కావాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను కేంద్ర జలశక్తిశాఖ ఆదేశించింది. ఈ పద్దులన్నింటిని లెక్కిస్తే రూ.25,390.61 కోట్లుగా ఉంది. ఈ మొత్తం 2014లో రాష్ట్ర విభజనకు ముందు చేసిన వ్యయంగా పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ పద్దుల మేరకు మాత్రమే నిధులు మంజూరు చేయాలని పీపీఏకు కేంద్ర జలశక్తి శాఖ సూచించింది.
పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ. 55,656.87 కోట్లుగా కేంద్ర జల సంఘం, రూ.47,725.74 కోట్లుగా తుది అంచనాల సవరణ కమిటీ 2017లో నిర్ధారించాయి. కానీ కేంద్రం మాత్రం వాటిని అధికారికంగా గుర్తించలేదు. తుది అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్లకు సీఎం జగన్ పలు దఫాలుగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర జలసంఘం అంచనా మేరకు భూ సేకరణ వ్యయం రూ.13,077.15 కోట్లు, పునరావాసానికి ఖర్చు రూ.20,091.09 కోట్లుగా ఉంది.
కేంద్ర జలశక్తి, కేంద్ర ఆర్థికశాఖతో కూడిన తుది అంచనా వ్యయ కమిటీ భూ సేకరణకు రూ.10,199.67 కోట్లు, సహాయ పునరావాసానికి రూ.17,972.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ అంచనాలనూ కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కోసం చేస్తున్న ఖర్చులు చెల్లించాలంటూ పీపీఏకు జల వనరుల శాఖ బిల్లులు పంపుతోంది. నెలల తరబడి బిల్లులు ఆమోదించడం లేదు. భూసేకరణ కోసం రూ.487 కోట్లు రీయింబర్స్మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంటే అందులో రూ.400 కోట్లకు ఇటీవల సమ్మతి తెలిపిన పీపీఏ మరో రూ.87 కోట్లకు మాత్రం కొర్రీ వేసింది. దీనికి జల వనరుల శాఖ వివరణలు ఇస్తూనే ఉంది. పోలవరానికి నిధుల విషయంలో కేంద్రం తన వైఖరికే కట్టుబడి ఉండటం రాష్ట్ర జల వనరుల శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.