భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
posted on Nov 28, 2020 @ 3:48PM
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పరిశోధనల తీరుతెన్నులను పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇవాళ హైదరాబాదులోని భారత్ బయోటెక్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విచ్చేసిన ప్రధాని మోదీ హకీంపేట వాయుసేన విమానాశ్రయం నుంచి నేరుగా భారత్ బయోటెక్ క్యాంపస్ కు వెళ్లారు. అక్కడ ప్రధాని పరిశోధనలపై సమీక్ష నిర్వహించారు. అలాగే, భారత్ బయోటెక్ యాజమాన్యాన్ని, శాస్త్రవేత్తలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి పని చేస్తోందన్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రధాని మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో జైడస్ బయోటెక్ పార్క్లో కరోనా వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. వ్యాక్సిన్ తయారుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు. హైదరాబాద్ పర్యటన అనంతరం మోదీ పూణే బయల్దేరారు. పూణేలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను మోదీ సందర్శించనున్నారు.