ఆక్సిజన్ సరఫరాకు మోడీ యాక్షన్ ప్లాన్
posted on Apr 22, 2021 @ 5:58PM
కరోనా పంజాతో దేశంలోని హాస్పిటల్స్ అన్న నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. తమ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్రాలు అభ్యర్థిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ ఉత్పత్తితో పాటు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచే ఉపాయాలపై చర్చించారు. ఆక్సిజన్ సప్లైను ఎలా వేగవంతం చేస్తున్నామన్న దానిపై అధికారులు ప్రధానికి వివరించారు. ఆక్సిజన్ కొరత విషయంలో ఇప్పటికే తాము అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నామని, వారి అవసరాలను గుర్తించామని అధికారులు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. 20 రాష్ట్రాలకు ప్రస్తుతం రోజుకు 6,785 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని, ఈ నెల 21 వ తేదీ నాటికి 6,822 మెట్రిక్ టన్నులను కేటాయించామని అధికారులు వివరించారు. కొన్ని రోజులుగా లిక్విడ్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగిందని, దీంతో పరిశ్రమలకు, స్టీల్ ప్లాంట్లకు ఆక్సిజన్ సరఫరాను నిషేధించామని అధికారులు మోడీ దృష్టికి తీసుకొచ్చారు. ఇంతటి క్లిష్ట సమయంలో అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని పీఎం కోరారని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, దీన్ని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఉత్పత్తి పెంచడానికి తగిన మార్గాలను అన్వేషించి, తర్వితగతిన ఆక్సిజన్ను రాష్ట్రాలకు సరఫరా చేయాలని మోడీ ఆదేశించారు. నైట్రోజన్ ఆర్గాన్ కోసం నిర్దేశించిన క్రయోజనిక్ ట్యాంకర్లను కూడా ఇటు వైపు మళ్లించి, ఆక్సిజన్ సరఫరా కోసం అందుబాటులోకి తేవాలని ప్రధాని సూచించారు. ఆక్సిజన్ సరఫరా కోసం రైళ్లను కూడా వినియోగించుకోవాలని ఆదేశించారు. ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించడం పూర్తైన తర్వాత ఖాళీ ట్యాంకర్లను విమానంలో వెనక్కి తీసుకురావాలని మోడీ సూచించారు.
‘‘ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత సమీక్ష సమావేశం జరిగింది. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత గురించి చర్చించారు. ఆక్సిజన్ ఉత్పత్తిని ఎలా పెంచాలి? అన్న దానిపై సమాలోచనలు జరిపారు. డిమాండ్కు తగ్గ ఆక్సిజన్ను అందుబాటులోకి తీసుకురావడానికి ఎలా కష్టపడుతున్నామన్న విషయాన్ని అధికారులు మోదీకి వివరించారు’’ అని పీఎంవో వెల్లడించింది.