ఎన్టీఆర్ స్మారక నాణెం.. విక్రయాల సునామీ.. ఇప్పుడు ఏపీలో కూడా!
posted on Jan 9, 2024 5:43AM
ఎన్టీఆర్ స్మారక నాణెం ఏపీలోనూ అందుబాటులోనికి రానుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ మింట్ కాంపౌండులోనే లభ్యమైన ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెలు.. ఇకపై విజయవాడ, విశాఖ నగరాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక కౌంటర్లు ద్వారా వీటిని ఏపీలోకి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఏపీలో అమ్మకానికి మరో 12 వేల నాణేల ముద్రణకు కేంద్రం అనుమతించింది.
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ముఖచిత్రంతో 100 రూపాయల నాణెంను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కాయిన్ను ఆగస్ట్ 28 ఢిల్లీలోని రాష్ట్రపతి కల్చరల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి నందమూరి కుటుంబీకులు బాలకృష్ణ, జయకృష్ణతోపాటు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగువారు దైవసమానంగా భావించే హీరో, శక పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు. సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ అధిరోహించని ఎత్తులు లేవు. ఆయనను అభిమానించని తెలుగువాడు ఉండడు. అటువంటి ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగుజాతి ఉన్నన్నాళ్ళు ఆయన నామం చిరస్మరణీయం. అందుకే ఆయనకు సంబంధించి ఏ చిన్న అంశమైనా తెలుగు వారంతా తమ సొంతంగా భావిస్తారు. ఆయనకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా తెలుగు జాతి ఉమ్మడిగా కదిలి వస్తుందనడానికి ఎన్టీఆర్ స్మారక నాణేం విక్రయాలే ఉదాహరణ.
ఆగస్టు 28న విడుదలైన ఈ నాణేన్ని అదే నెల 29 నుంచి ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో విక్రయానికి అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ లో అమ్మకాలు చేపట్టగా తొలిరోజే విశేష స్పందన లభించింది. ఆ రెండు కేంద్రాల్లో కలిపి తొలిరోజు ఐదు వేల వరకు నాణేల విక్రయాలు జరిగాయి. కొద్ది నిమిషాల్లోనే ముద్రించిన నాణేలన్నీ విక్రయాలు జరిగిపోగా.. మరోవైపు ఆన్లైన్లో విక్రయాలు ప్రారంభించిన కొద్ది గంటలకే వెబ్సైట్లో అవుటాఫ్ స్టాక్ బోర్డు పెట్టారు. సాధారణంగా స్మారక నాణేలకు పెద్దగా డిమాండ్ ఉండదు. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ నాణేలకు విపరీతమైన డిమాండ్ ఉండటం ఆయన పట్ల తెలుగువారి అభిమానానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏ స్మారక నాణేనికి లేని డిమాండ్ ఎన్టీఆర్ నాణేనికి ఉందని మింట్ ఫైనాన్స్ జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ అప్పట్లోనే చెప్పారు. ఇప్పటి వరకూ విడుదల చేసిన నాణేలేవీ పదివేలకు మించి ముద్రించలేదని, ఎన్టీఆర్ నాణేనికి డిమాండ్ ఉంటుందని భావించి ముందుగానే 12వేలు ముద్రించామని, అయితే అవి తొలిరోజే అమ్ముడవడం విశేషమని శ్రీనివాస్ చెప్పారు. ఆ తరువాత మరో రెండు విడతలుగా 13 వేల ఎన్టీఆర్ స్మారణ నాణేలను ముద్రించగా అవీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. స్మారణ నాణేల విక్రయాలలో ఎన్టీఆర్ స్మారక వందరూపాయల నాణెం గత రికార్డులనన్నిటినీ అధిగమించేసింది. ఎన్టీఆర్ నాణేనికి ముందు వరకూ స్మారక నాణేల విక్రయాల రికార్డు 12వేలు మాత్రమే. అయితే ముద్రణ అయిన రెండు నెలలలోనే పాతిక వేల ఎన్టీఆర్ స్మారణ నాణేల విక్రయం జరిగింది. ఇప్పుడు ఏఫీలో అందుబాటులోకి తీసుకురావడానికి మరో 12 వేణ నాణేలను ముద్రిస్తున్నారు.