శక పురుషుడు ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల వెండి నాణెం విడుదల 28న
posted on Aug 9, 2023 @ 5:40PM
నందమూరి తారక రామా రావు... తెలుగు ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు. ఒక సినిమా హీరోగా ఆయన తాను ‘జీవించిన’ పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా నటుడు ఎన్టీఆర్.
రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్. దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్. రాముడు ఎలా ఉంటాడాంటే, ఆ నాటి నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని అడిగినా ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్ లాగానే ఉంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ... అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో సజీవంగా ఉన్నారు.
అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా చరిత్ర సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు.
సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలు రాయిలా చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది. అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఓ తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదలకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గత ఏడాది జూన్లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపిన సంగతి విదితమే. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ ను విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆగష్టు 28న ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్ విడుదల చేయనున్నారు. పురందేశ్వరి ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ ఎన్టీర్ బోమ్మతో ఉన్న వందరూపాయల నాణెం విడుదల కానున్నది. ఈ నాణెం విడుదలకు సంబంధించిన ఆహ్వానాన్ని పురంధేశ్వరి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నెల 28న భారత రాష్ట్రపతి చేతుల మీదగా ఎన్టీఆర్ రూ.100 కాయిన్ విడుదల కానున్నట్లు తెలిపారు. పురంధేశ్వరి పంచుకున్న కాయిన్ రిలీజ్ వేడుక ఆహ్వానాన్ని మిగతా కుటుంబ సభ్యులు కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండగా.. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక, ఎన్టీఆర్ రూ.100 కాయిన్ విషయానికి వస్తే.. 44 మిల్లీమీటర్లు చుట్టు కొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది. అంతేకాదు ఐదు శాతం నికెల్, ఐదు శాతం లోహాలు ఉంటాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని, 1923-2023 అని ముద్రించి ఉంటుంది. ఈ విషయాన్ని గతంలో భారత ప్రభుత్వం ఇచ్చిన గెజిట్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న కాయిన్ ఎవరికైనా కావాలంటే రిజర్వు బ్యాంకు కౌంటర్ లేదా ఏదైనా బ్యాంకులో రూ.4,160 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ చిత్రంతో కూడిన నాణెంతో పాటు ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను చిన్న బుక్లెట్ రూపంలో 4 పేజీల్లో ముద్రించి కొనుగోలుదారులకు అందజేస్తారు. మొత్తానికి ఇప్పుడు ఎన్టీఆర్ రూ.100 నాణెం రాబోతుండడంతో ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.