ఉత్తుత్తి మాటలెందుకు... ఉత్తరాంధ్రకు చేసిందేమిటో చెప్పండి ముందు?

విశాఖపట్నం రాజధానిపై తమ అభిప్రాయాలను జనం నోరు విప్పి చెప్పకపోతే ఉత్తరాంధ్ర కొంప మునిగిపోతుందట. ‘విశాఖ రాజధాని కావాలని గొంతెత్తి అనడానికి ఏమైంది? మన కోసం మనం నోరు విప్పలేకపోతే.. మన అమాయకత్వాన్ని వేరెవరైనా సొమ్ము చేసుకోరా? మన గడ్డ మీదకు వచ్చి అరసవిల్లి దేవుడికి దణ్ణం పెట్టుకుంటే ఓకే.. విశాఖపట్నం రాజధాని వద్దని ఇక్కడికి వచ్చి మనకు చెబుతారంట. ఎంత అన్యాయం అది. అమాయకులం కాదని మనం రుజువు చేయాలి. ఇప్పటికైనా నోరు విప్పండి’ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్న తీరు ఇలా సాగిపోయింది. జనం నోరు విప్పితే వారి పిల్లోడికి అవసరమైన రాజధాని వస్తది.. మీ అన్నదమ్ములకు కావాల్సిన ఒక సంస్థ వస్తది.. మీ తర్వాతి పిల్లలకు ఉపాధినిచ్చే అభివృద్ధి వస్తది.. దాని కోసం నోరు విప్పలేవా…? అంటూ ఉత్తరాంధ్రప్రజలను మంత్రి ధర్మాన రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఏపీకి ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ‘అమరావతి టూ అరసవిల్లి’ మహా పాదయాత్ర ఉత్తరాంధ్ర సమీపానికి చేరువౌతున్న తరుణంలో ఆ ప్రాంతంలోని వైసీపీ నేతలు, మంత్రులు స్థానిక ప్రజల్ని రెచ్చగొడుతున్న తీరుకు ధర్మాన ప్రసాదరావు మాటలు అద్దం పడుతున్నాయి. ధర్మాన ప్రసాదరావే కాకుండా మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారామ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ,, అవంతి శ్రీనివాస్, గొల్ల బాబూరావు కూడా ఇదే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలను అమరావతి రైతులపైకి ఉసిగొల్పుతుండడం గమనార్హం. కరణం ధర్మశ్రీ అయితే.. రాజీనామా అంటూ ఓ చక్కని డ్రామాను రక్తి కట్టించారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తాను రాజీనామా చేశానంటూనే.. ‘టీడీపీ వ్యతిరేకిస్తున్న ఏపీకి మూడు రాజధానులకు మద్దతుగా’ తన రాజీనామా అంటూ ఆ ఏ విధంగా చూసినా స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించని విధంగా జాగ్రత్త పడ్డారు. పైగా రాజీనామా లేఖను నేరుగా స్పీకర్ కు కాకుండా మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఏసీ నేతకు అందించడంలోని ధర్మశ్రీ నిజాయితీపై మీడియా ముఖంగా ప్రశ్నలు వచ్చాయి.

విశాఖ రాజధాని అంటూ గొంతు చించుకుంటున్న ఉత్తరాంధ్రలోని వైసీపీ నేతలు, వారి కుటుంబాలు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి కూడా ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చే పని చూపడానికి  ఒక్కటంటే ఒక్కటి కూడా లేని పరిస్థితి. దీనినే జనం ఎత్తి చూపుతున్నారు. దశాబ్దాలుగా మంత్రులుగా.. ఎమ్మెల్యేలుగా.. ఇంకా అనేక పదవులు వెలగబెట్టిన వారంతా తమ ప్రాంత అభివృద్ధికి ఏం ఒరగబెట్టారంటూ  జనం ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. 

బొత్స సత్యనారాయణ కుటుంబం రెండు దశాబ్దాలకు పైగాను, ధర్మాన ఫ్యామిలీ మూడు దశాబ్దాలకు పైగా, గుడివాడ అమర్ నాథ్ కుటుంబం ఏకంగా ఏడు దశాబ్దాలుగా  , తమ్మినేని సీతారామ్ ఫ్యామిలీ నాలుగు దశాబ్దాలకు పైగా, కోలగట్ల వీరభద్రస్వామి, కరణం ధర్మశ్రీ రెండేసి దశాబ్దాలు, గొల్ల బాబూరావు, అవంతి శ్రీనివాసరావులు పదమూడేసి ఏళ్లు ఉత్తరాంధ్రలో రాజకీయ నేతలుగా, ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ:  ప్రస్తుతం ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ హయాంలో భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, రవాణా, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్నారు. జగన్ తొలి కేబినెట్ లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు నిర్వహించారు. 1999లో బొబ్బిలి లోక్ సభా స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ కూడా విజయనగరం నుంచి లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు. బొత్స తమ్ముడు అప్పల నర్సయ్య తదితరులు రాజకీయంగా ఎదిగారు. అయితేనేం.. ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని ఇప్పుడు గగ్గోలు పెడుతున్న బొత్స కుటుంబం తమ ప్రాంతానికి చేసిన మేలు ఒక్కటైనా ఉందేమో చూపించాలని ప్రజలు నిలదీస్తున్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి బొత్స కుటుంబం కృషి చేయకపోతే పోయింది.. ఆయన భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో ఏర్పాటు కావాల్సిన ఫోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమ  పారిపోయేలా చేసిన ఘనుడని, ఆ పరిశ్రమ కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము వృథా చేసిన వైనాన్ని జనం గుర్తుచేస్తున్నారు. తీరా ఫోక్స్ వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేయకుండా ఎగిరిపోయిన తర్వాత ‘సొమ్ములు పోనాయి.. ఏటిసేత్తాం’ అన్న బొత్స వ్యాఖ్యల్ని ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబం నుంచి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులుగా దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తోంది. ఏపీ విభజనకు ముందు ధర్మాన ప్రసాదరావు రోడ్లు, భవనాల శాఖ, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లలో చేనేత, జౌళిశాఖ, క్రీడలు, చిన్న తరహా నీటిపారుదల, మైనర్ పోర్టుల మంత్రిగా వెలగబెట్టారు. ఇప్పుడు జగన్ రెండో కేబినెట్ లో రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా ఉన్నారు. అమరావతి రైతులు అరసవిల్లి పాదయాత్ర ఉత్తరాంధ్ర సమీపంలోకి వస్తున్న తరుణంలో ఆ ప్రాంత ప్రజల్ని రెచ్చగొడుతున్న ధర్మాన ప్రసాదరావు అన్ని శాఖల మంత్రిగా ఏం అభివృద్ధి చేశారో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నే అంటున్నారు. రెవెన్యూ మంత్రిగా ప్రసాదరావు వాన్ పిక్ భూముల కేటాయింపులో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాన్ పిక్ భూముల వ్యవహారంలో ధర్మాన ప్రసాదరావుపై సీబీఐ  నాంపల్లి ప్రత్యేక కోర్టులో చార్జిషీటు కూడా దాఖలైన సందర్భాన్ని జనం గుర్తుచేస్తున్నారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా జగన్ తొలి కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. అంత పెద్ద పదవిలో ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కృష్ణదాస్ చేసిందేమిటో ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. తాము పవర్ లో ఉన్నప్పుడు లేని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇప్పుడు అమరావతి రైతుల మహా పాదయాత్ర సందర్భంగా గుర్తుకు రావడమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా జగన్ అనుమతిస్తే.. తమ తమ పదవులను విశాఖ రాజధాని సాధన కోసం ఉద్యమిస్తాని, పదవులు త్యాగం చేస్తామని చెప్పడంతో జనం అవాక్కవుతున్నారు.

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్.. 39 ఏళ్లుగా రాజకీయ జీవితం గడుపుతూ ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు స్పీకర్ గా వ్యవహరిస్తున్న ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసింది శూన్యం అంటున్నారు. ఎంతసేపూ అసెంబ్లీలో ఉంటేనే తాను స్పీకర్ ని అని, బయటికి వస్తే తాను వైసీపీ నేతనని, ఎమ్మెల్యేగా నియోజకవర్గం అంతా తిరుగుతానని చెప్పుకునే సీతారామ్ చేసిన అభివృద్ధి పనులేంటో చెప్పగలరా? అని జనం ప్రశ్నిస్తున్నారు. తొలుత టీడీపీలోనూ, తర్వాత ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి చివరికి వైసీపీలో తేలిన తమ్మినేని తన 18వ ఏట నుంచే ప్రజాజీవితంలో ఉన్నారు. ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ పదవి నుంచి తొమ్మిదేళ్ల పాటు ఏపీ మంత్రిగా 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు స్పీకర్ గా కొనసాగుతున్నారు. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీతారామ్ గతంలో తమ ప్రాంతం ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ కు ఏమి పాటుపడ్డారో అర్థం కాని పరిస్థితి ఉంది.

ఉత్తరాంధ్రలో ప్రస్తుత ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ నుంచి ఇప్పుడు మంత్రి అయ్యేదాకా పలు పదవులను అనుభవించారు అమర్ నాథ్. అమర్ నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా, లోక్ సభ సభ్యుడిగా పనిచేశారు. గురునాథరావు తండ్రి అప్పన్న కూడా రాజకీయ నాయకుడే. ఈ కుటుంబానికి రాజకీయాల్లో ఆరు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఇప్పుడు అమరావతి రైతు పాదయాత్రపై ఒంటికాలిపై లేచి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ తదితరులపై విమర్శలు ఎక్కుపెడుతున్న అమర్ నాథ్ కుటుంబం రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర కోసం ఒరగబెట్టిందేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తాననడం విడ్డూరంగా ఉందంటున్నారు. రాజధాని అమరావతి రైతుల పాదయాత్రకు పోటీ యాత్ర చేస్తామని అమర్ నాథ్ ప్రకటించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గుడివాడ కుటుంబానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే.. విశాఖ రాజధాని కోసం తన పదవికి రాజీనామా చేసినట్లు ఓ హై డ్రామా నడిపారు. ఆయన చేసిన రాజీనామా స్పీకర్ ఫార్మాట్ లోనే ఉందని చెబుతూ.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా అనే అంశాన్ని తన రాజీనామా లేఖలో రాయడం ఏ ఫార్మాట్ కిందికి వస్తుందో అని రాజకీయ విశ్లేషకులు అవాక్కవుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, విశాఖ రాజధాని నెపంతో ధర్మశ్రీ ఓ పొలిటికల్ డ్రామా ఆడారని అంతా ముక్కున వేలేసుకున్నారు. తాను ఎమ్మెల్యే అయినా.. జగన్ రెడ్డి నీడలో కిట్టుబాటు ఏమీ కావడం లేదో ఏమో ఎప్పుడో రాసిన టీచర్ ఉద్యోగం రావడంతో దాంట్లో చేరిపోతానని చెప్పడం అందరూ గమనించారు. ఇప్పుడు విశాఖ రాజధాని సాధన సమితికి రాజీనామా లేఖ ఇచ్చి, వార్తల్లోకి ఎక్కాలని చూసిన ధర్మశ్రీ తన పదవీకాలం మొత్తం ఉత్తరాంధ్రకు, కనీసం తన సొంత నియోజకవర్గంలోనైనా ఏమైనా అభివృద్ధి చేశారా? అని అంటున్నారు.

గతంలో టీడీపీ హయాంలో అనకాపల్లి లోక్ సభా స్థానం నుంచి ఎన్నికైన ముత్తంశెట్లి శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర అభివృద్ధి సంగతి పక్కనపెడితే కనీసం అనకాపల్లి నియోజకవర్గానికైనా ఏమైనా సాధించారా? అంటే లేదనే చెబుతున్నారు. పార్లమెంట్ లో వివిధ కమిటీల్లో పనిచేశారు. మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడైనా ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మానవ వనరుల అభివృద్ధికి ఏదైనా మేలు చేశారా అనేది ప్రశ్నార్థకం. విశాఖ రైల్వే జోన్ కోసం ఆయన చేసిన గట్టి కృషి ఏమీ లేదంటున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అవంతి ఏమి కృషి చేశారంటున్నారు. అలాంటి అవంతి ఇప్పుడు విశాఖ పరిపాలన రాజధాని కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పడం ఓ పెద్ద్ జోక్ అంటున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర రెచ్చగొట్టేలా ఉందని, రోజుకో కార్యక్రమం నిర్వహించి ఉత్తరాంధ్ర ఉనికి చాటాలని ప్రజలను ఉసిగొల్పడాన్ని తప్పుపడుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన గొల్ల బాబూరావును ఉత్తరాంధ్రలోని పాయకరావుపేట ఓటర్లు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. గ్రూప్ వన్ అధికారిగా, విశాఖపట్నం జిల్లా డిప్యూటీ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా.. విశాఖ జిల్లా పరిషత్ సీఈఓగా, పంచాయతీరాజ్ అదనపు కమిషనర్గా.. ఇలా అనేక ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన బాబూరావు తనను గెలిపించిన పాయకరావుపేట ప్రజలకు ఏమి ఒరగబెట్టారంటే ఏమీ లేదనే చెబుతారు. ఎంతసేపూ తనకు మంత్రి పదవి కోసం పాకులాటే గానీ నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవంటారు. మూడు సార్లు ఎన్నికైన దళిత ఎమ్మెల్యేనని, తనను చిన్నచూపు చేస్తున్నారంటూ వాపోయే గొల్ల బాబూరావు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కానీ, తన నియోజకవర్గం గురించి కానీ పట్టించుకున్న సందర్భం లేదంటారు. అలాంటి గొల్ల బాబూరాబు రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం గమనార్హం.

ఉత్తరాంధ్రలోని విజయనగరంలో పుట్టి, పెరిగిన స్థానిక ఎమ్మెల్యే, ఇటీవలే డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఉత్తరాంధ్ర కోసం చేసిందేంటో కంచు కాగడా పెట్టి వెదికినా ఫలితం కనిపించదంటే అతిశయోక్తి కాదంటున్నారు. కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నుంచి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ దాకా వీరభద్రస్వామి పలు పదవులు అనుభవించారు. విజయనగరంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మహారాజా ప్రభుత్వ ఆస్పత్రి పేరును జగన్ రెడ్డి సర్కార్ రాత్రికి రాత్రే మార్చేసినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన కోలగట్ల ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏమి చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. వీరభద్రస్వామి ఎమ్మెల్యే అయిన తర్వాత విజయనగరంలో జరిగిన అభివృద్ది ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదంటారు. అమ్మకు కూడు పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడన్నట్లు విజయనగరం గురించే పట్టించుకోని కోలగట్ల ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకుంటారా అంటే నమ్మకం కలగడం లేదని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి అని, విశాఖనే కార్యనిర్వాహక రాజధానిగా చేయాలంటూ గొంతు చింపుకుని గోల పెడుతున్నారు. విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామాలు చేస్తుమని ప్రకటనలు చేసిన ఈ ఉత్తరాంధ్ర నేతలు ఒక్క రోజు గడవక ముందే రాజీనామాలపై సైలెంట్ అయిపోయారు. ఇలాంటి ఆషాఢభూతి నేతలతో ఉత్తరాంధ్రకు మేలు జరగడం అంటే ఎడారిలో ఒయాసిస్సును వెదకడం లాంటిదే అని స్థానిక జనం అంటున్నారు.

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.