చైనా అండతో రెచ్చిపోయి కాల్పులు జరిపిన నేపాల్..
posted on Jul 20, 2020 @ 10:20AM
భారత్ తో ఎంతో సఖ్యతతో ఉండే మన పొరుగు దేశం నేపాల్ ఈ మధ్య చైనా ప్రోద్బలంతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి భారత్ ను కవ్వించే విధంగా చేస్తున్న కామెంట్స్ తో అక్కడి అధికార పార్టీలో కూడా విభేదాలు తలెత్తాయి. తాజాగా నేపాల్ ప్రధాని ఓలి రాముడి అయోధ్య యూపీలోని డి కాదని అది నేపాల్ లో ఉందని చేసిన కామెంట్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా నేపాల్ మరో దుశ్చర్యకు పాల్పడింది. బీహార్లోని కిషన్ గంజ్ సరిహద్దుల్లో ఆదివారం నాడు భారత నేపాల్ సరిహద్దులలో పశువులను కాస్తూ వెళ్లిన జీతేంద్ర కుమార్ సింగ్తో పాటు మరో ఇద్దరు స్నేహితులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. భారత నేపాల్ సరిహద్దుల్లోని ఫతేపూర్లోని తెహ్రగచ్లో ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. నేపాల్ పోలీసులు జరిపిన ఈ కాల్పుల్లో జీతేంద్ర సింగ్ గాయపడడంతో అతనిని హాస్పిటల్ కు తరలించినట్లు కిషన్ గంజ్ డీఎస్పీ అన్వర్ జావెద్ తెలిపారు. ఐతే కాల్పుల నుంచి మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారని అయన తెలిపారు. ఈ ఘటన తో స్థానికల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఈ ఘటనపై తాము విచారణ చేపట్టామని అలాగే నేపాల్ అధికారవర్గాలతో చర్చలు జరుపుతున్నామని కిషన్ గంజ్ డీఎస్పీ తెలిపారు.