పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి!
posted on Apr 17, 2021 @ 12:06PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందంటూ ఓ వీడియోను పోస్ట్ చేస్తూ వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు.
'పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి.. ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్టే ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి బయటి నుంచి తన ముఠాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు' అని నారా లోకేష్ ఆరోపించారు.
'పెద్దిరెడ్డి మనుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పీఎల్ఆర్ కల్యాణ మండపంలో మకాం వేసి దొంగ ఓట్లు వేయడానికి వెళ్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరిగిన పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పోలీసులు అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎలక్షన్ జరగకుండా సెలక్షన్ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న తిరుపతి ఎన్నికని అక్రమార్గంలో గెలవాలని నేరుగా తానే రంగంలోకి దిగారు' అని లోకేశ్ చెప్పారు.
'తిరుపతి ఉపఎన్నికలో రిగ్గింగ్, దొంగ ఓట్లతో నెగ్గాలని వేసిన ప్రణాళికని తెలుగుదేశం బట్టబయలు చేసింది. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలి. దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల తరలివచ్చిన వేలాది మందిని అరెస్ట్చేసి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి' అని ట్విట్ ద్వారా లోకేశ్ డిమాండ్ చేశారు.