నాగంను కట్టడిచేసే పనిలో టీడీపీ
posted on Apr 18, 2011 @ 10:46AM
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి వ్యవహారం మితిమీరుతున్నందున తెలంగాణలో నాగం చేపడుతున్న పాదయాత్రకు చెక్ చెప్పేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు యోచిస్తున్నట్టుగా సమాచారం. పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలతో ఇబ్బందులు సృష్టిస్తున్న నాగంను కట్టడి చేసేందుకు తెలుగుదేశం అధిష్ఠానం వ్యూహం రచించింది. టీడీపీ తెలంగాణ ఫోరం స్థానంలో ఒక ఉమ్మడి కమిటీని నియమించాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ జెండా కిందే తెలంగాణ ఉద్యమాన్ని స్వతంత్రంగా నడుపుకొనేందుకు ఈ ప్రాంత నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 9వ తేదీ నుంచి నాగం పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే నాగంకు ధీటుగా తెలంగాణ ప్రజాప్రతినిధులను రంగంలోకి చంద్రబాబు దించనున్నట్టుగా తెలుస్తోంది. 2008లో చేసిన తీర్మానం, 2009లో పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు పార్టీ కట్టుబడే ఉందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బాబు తెలంగాణ ప్రజా ప్రతినిధులకు సూచించినట్లుగా తెలుస్తోంది. యువ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తదితదితరులతో తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.