మహారాష్ట్రలో లాక్ డౌన్! వ్యతిరేకిస్తున్న వ్యాపారులు
posted on Apr 10, 2021 8:59AM
కరోనా పంజాతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మాల్స్, మల్టీప్లెక్స్ లు, మార్కెట్లు, నిత్యావసరాలు మినహా మిగిలిన దుకాణాలను మూసివేయాలని, వారాంతంలో పూర్తి లాక్ డౌన్ అమలవుతుందని తెలిపింది. అయితే మహారాష్ట్ర సర్కార్ నిర్ణయాన్ని వాణిజ్య సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మేరకు మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ (ఎంఏసీసీఐఏ) సోమవారం నుంచి తాము దుకాణాలన్నీ తెరుస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలోని దాదాపు 800కు పైగా వాణిజ్య, పరిశ్రమ సంఘాలు ఎంఏసీసీఐఏ కింద పని చేస్తున్నాయి. అయితే ఇతర ముఖ్య వర్తక సంఘాలు సీఏఐటీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్), ఎఫ్ఆర్టీడబ్ల్యూఏ (ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ ఫేర్ అసోసియేషన్) మాత్రం లాక్ డౌన్ కు సిద్ధమవుతున్నాయి.
గత బుధవారం వివిధ ట్రేడ్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమ నిర్ణయాన్ని వెలువరించగా, కొన్ని సవరణలు కావాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నాడు సీఎం కొన్ని సవరణలను ప్రకటిస్తారని భావిస్తున్నామని ఎంఏసీసీఐఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లలిత్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సవరణలను ప్రకటించకున్నా, దుకాణాలను తెరవాలని తాము నిర్ణయించామని, ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
పండగ సీజన్ లో షాపుల మూసివేత కారణంగా తాము తీవ్రంగా నష్టపోతామని, ఇప్పటికే గత సంవత్సరం నెలకొన్న పరిస్థితులతో భారీ నష్టాల్లో ఉన్న తాము, మరోసారి కష్టాల్లోకి జారాలని భావించడం లేదని, అన్ని రకాల వాణిజ్య కేంద్రాలను మూసివేయడం సహేతుకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో తాము ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని, ముఖ్యమంత్రిపై తమకు గౌరవం ఉందని, తాము చట్టాన్ని అతిక్రమించాలని భావించడం లేదని ఎఫ్ఆర్టీడబ్ల్యూఏ ప్రతినిధి వీరేన్ షా వ్యాఖ్యానించారు.