'ఏసయ్యా మరియ తనయా..' అని పాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది
posted on Oct 21, 2020 @ 5:05PM
ఏ ప్రభుత్వమైనా కేవలం ఒక మతాన్ని ప్రోత్సహించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఒక మతాన్ని పోత్సహిస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ తరహా ట్రెండ్ ను పునాది దశలోనే అరికట్టకపోతే హిందువులకు కష్టాలు తప్పవని పేర్కొన్నారు. క్రైస్తవ మత వ్యాప్తిని అడ్డుకోకపోతే.. హిందూ ధర్మానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
రామరాజ్యాన్ని క్రైస్తవ రాజ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మనం గుళ్లలో ఉదయాన్నే ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన "కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే" అని సుప్రభాతం వింటుంటాం. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ను అరికట్టకపోతే.. "ఏసయ్యా మరియ తనయా పూర్వా సంధ్యా ప్రవర్తతే" అని పాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
అన్ని మతాలను గౌరవించాల్సిందే.. అందులో తప్పేంలేదు. కానీ, ఒక మతాన్నే ప్రభుత్వ సొమ్ముతో ప్రోత్సహిస్తుండడం బాధాకరమన్నారు. హిందూ స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. "మన డబ్బులు పాస్టర్లకు ఇస్తున్నారు, మన డబ్బులతో చర్చిలు నిర్మిస్తున్నారు. రాజ్యాంగంలో పరమత సహనం ఉండాలని చెప్పారు. ఒక మతాన్నే ప్రోత్సహించడం సబబు కాదు. దీన్ని అందరూ ఖండించాలి" అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.