తెలంగాణలో ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇలా.. యూపీలో అలా.. బీజేపీకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
posted on Nov 30, 2020 9:18AM
తీవ్ర సవాళ్లు ప్రతి సవాళ్లతో సాగిన జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రంతో ముగిసిన సంగతి తెల్సిందే. ఇక మరికొన్ని గంటలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న సమయంలో బీజేపీ తరుఫున ప్రచారం చేయడానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణలో ఆడ బిడ్డలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని ఆరోపించగా, మంత్రి కేటీఆర్ ఆయనకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక ఏడాది క్రితం ఇక్కడ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, హైదరాబాద్ లో ఏం జరిగిందో దేశం మొత్తం చూశారని అయన అన్నారు. అదే యూపీలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు (హత్రాస్ తో సహా పలు ఘటనలు) జరుగుతూ ఉంటే, అక్కడి ప్రభుత్వం ఎం చేస్తోందో కూడా అందరు చూసారని యోగి పై సెటైర్లు వేశారు.
అంతేకాకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఈ లెక్కన గడచిన ఆరేళ్లలో 12 కోట్ల కొత్త ఉద్యోగాలు రావాల్సి వుండగా, దానికి బదులు, అసలు ఉన్న ఉద్యోగాలే పోతున్నాయని అయన అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి తీరాలని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేసారు. కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్లను పన్ను రూపంలో తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే, కేవలం రూ.1.40 లక్షల కోట్లను మాత్రమే తిరిగి ఇచ్చారని, ఇదెలా ఉందంటే రూపాయి కడితే ఆఠాణా ఇచ్చినట్లుందని అయన కేంద్ర ప్రభుత్వం పై సెటైర్లు వేశారు.
దేశ ప్రజల కోసం ఏమీ చేయని బీజేపీ, పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో ఐటీ రంగానికి సపోర్ట్ గా నిలబడతామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ ను రద్దు చేసిందని, దీంతో చదువుకున్న యువత నోట్లో మట్టి కొట్టినట్లయిందని అయన అన్నారు. గడచిన ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వం కనీసం ఒక్కరూపాయి కూడా విదల్చలేదని కేటీఆర్ మండిపడ్డారు.