పోలీసులపై వలస కూలీల దాడి
posted on May 4, 2020 @ 3:40PM
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వలస కూలీల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. తమ స్వస్థలాలకు పంపించాలని ఉదయం నుంచి వలస కార్మికులు ఆందోళనకు దిగారు. కొవ్వూరు ప్రధాన రహదారిపైకి ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, బిహార్ ,ఒడిశాకు చెందిన 300 మందికిపైగా వలస కూలీలు చేరి ధర్నా చేపట్టారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులపై రాళ్లు, సీసాలతో వలస కూలీలు దాడి చేశారు. లాఠీఛార్జి చేసి వలసకూలీలను పోలీసులు చెదరగొట్టారు.
సొంత రాష్ట్రాలకు పంపాలని జాతీయరహదారిపై వలసకూలీలు ఆందోళన చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి అనుమతి వచ్చే వరకు పంపలేమని పోలీసులు చెబుతున్నారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న డీఎస్పీ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కూలీలను తరలించేందుకు ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు వచ్చేంత వరకూ పంపించలేమని చెప్పారు. అయితే శాంతించని వలస కూలీలు పోలీసులపై రాళ్లు, సీసాలు విసిరి దాడికి దిగారు. దీంలో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. కూలీలు నడిచి వెళతామని పట్టుపడటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
వీరంతా గోదావరి నదిలో ఇసుక కార్మికులుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. అయితే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.