Read more!

15మంది కార్పొరేటర్లతో కలిసి కారు దిగి చేయందుకున్న మేయర్ విజయలక్ష్మి

గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు తిరగి కోలుకోలేనంత గట్టి దెబ్బ తగలనుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పదిహేను కార్పొరేటర్లతో కలిసి కారు దిగి చేయి అందుకోవడానికి రెడీ అయిపోయారు. శనివారం (మార్చి 23) సాయంత్రం ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గాంధీభవన్ ఇందుకు వేదిక కానుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గద్వాల విజయలక్ష్మి 15 మంది కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.

ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరారు. ఆయన కాంగ్రెస్ తరఫున లోక్ సభ అభ్యర్థిగా ఫిక్స్ అయిపోయారు కూడా. అలాగే మాజీ మేయర్, గ్రేటర్ పరిధిలో గట్టి పట్టున్న బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పంచన చేరారు. ఇప్పుడు తాజాగా మేయర్ విజయలక్ష్మి సైతం కారు దిగిపోయి చేయందుకోవడానికి రెడీ అయిపోయారు. 

నిజానికి శుక్రవారం (మార్చి 22) సాయంత్రమే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ చేరిక లాంఛనం పూర్తైపోతుందని అంతా భావించారు.  కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ స్వయంగా ఆమెను కలిశారు. ఈ భేటీలో గద్వాల విజయలక్ష్మి తండ్రి కేకే కూడా ఉన్నారు. ఈ భేటీ కేకే నివాసంలోనే దాదాపు గంట సేపు జరిగింది.  ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా   దీపాదాస్‌ మున్షీ.. వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా  కేకే పలు ప్రతిపాదనలు దీపాదాస్ మున్షీ ముందు ఉంచగా, వాటిపై పార్టీలో చర్చించిన అధిష్ఠానం వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విజయలక్ష్మి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.