66 మంది విద్యార్థులకు కరోనా! మద్రాస్ ఐఐటీ క్లోజ్
posted on Dec 14, 2020 @ 1:03PM
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నా.. తమిళనాడు రాష్ట్రంలో మాత్రం వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా చెన్నైలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలో కరోనా కలకలం రేపింది. ఐఐటీ క్యాంపస్ లో 774 మంది విద్యార్థులు ఉండగా, 66 మంది స్టూడెంట్స్, ఐదుగురు సిబ్బందికి కరోనా సోకింది. ఒకే రోజు 32 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ కేసుల సంఖ్య మరింతగా పెరగనుందని వైద్య నిపుణులు చెప్పారు. దీంతో ఐఐటీని మూసి వేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.
ఐఐటీలోని అన్ని విభాగాలు, లైబ్రరిని వెంటనే మూసివేశారు. అధ్యాపకులు, ఇతర సిబ్బంది, పరిశోధకులు, ప్రాజెక్టుల సిబ్బంది ఇంటి నుంచి పని చేయాలని యాజమాన్యం సూచించింది. క్యాంపస్ లో ఉన్న విద్యార్థులు, హాస్టల్ గదుల్లో మాత్రమే ఉండాలని, బయటకు రావద్దని, కరోనా నిబంధనలన్నీ పాటించాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని, భౌతిదూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సర్క్యులర్ ను విడుదల చేసింది. విద్యార్థులు, సిబ్బందిలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారు అధికారులకు సమాచారం ఇవ్వాలని మద్రాస్ ఐఐటీ యాజమాన్యం సూచించింది.