మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్
posted on Apr 4, 2021 @ 9:49PM
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. సెకెండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 49,447 కేసులు నమోదు కాగా 277 మంది చనిపోయారు. ఏప్రిల్ రెండో వారానికి కరోనా మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వైద్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీంతో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. లాక్ డౌన్ విధించింది.
సోమవారం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆంక్షలు విధించింది. వీకెండ్ లాక్డౌన్ను(శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 వరకు) అమలు చేయాలనిసంచలన ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని, 50శాతం సిబ్బందితోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నడిపించాలని ఆదేశించింది.
హోటళ్లలో పార్శిల్ సేవలకు మాత్రం మహా సర్కారు అనుమతులు ఇచ్చింది. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో మహా సర్కారు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసుల కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.