కేసీఆర్ ను ఏకాకిగా మారుస్తున్న యాంటీ సెంటిమెంట్!
posted on Jul 11, 2022 7:55AM
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నారు. అలాగే కాలం కలిసి రాకపోతే తాడే పామౌతుందనీ అంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా కాలం కలిసి రాకపోతే.. అన్నట్లు ఉంది. జాతీయ రాజకీయాలంటూ ఆయన ఎంత హడావుడి చేసినా పెద్దగా మద్దతు రావడం లేదన్నది పక్కన పెడితే.. ఆయనతో రాజకీయంగా సన్నిహితంగా వచ్చిన వారందరికీ ఏదో రూపంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ (పీకే) నుంచి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ వరకూ అందరూ ఏదో విధంగా ఇబ్బందులు పడ్డవారే. సినిమా పరిశ్రమ తరువాత సెంటిమెంట్లను ఎక్కవగా నమ్మేది రాజకీయ రంగంలోనే అంటుంటారు. అంతెందుకు స్వయంగా తెరాసయే సెంటిమెంట్ అస్త్రాన్నే రాజకీయ సోపానంగా చేసుకుని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత మరో సారి తెరాసను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి సెంటిమెంటునే ఆశ్రయిస్తున్నారు. అటువంటి కేసీఆర్ కు ఇప్పుడు జాతీయ రాజకీయ అరంగేట్రం వద్దకు వచ్చే సరికి అన్నీ యాంటీ సెంటిమెంట్ ఉదంతాలే ఎదురౌతున్నాయి.
గత రెండు ఎన్నికలనూ టీఆర్ఎస్ సొంత బలంతో ఎదుర్కొని తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయానికి వ్యూహరచన, పథకాల రూపకల్పన దగ్గర నుంచి ప్రచార సారథ్యం వరకూ అన్ని కేసీఆర్ తన భుజస్కంధాలపై మోశారు. ఒంటి చేత్తో పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గట్టెక్కించడానికి ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ను ఆశ్రయించారు. పీకే కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. పలు మార్లు కేసీఆర్ తో ప్రగతి భవన్ లోభేటీ అయ్యారు. అక్కడే మకాం వేసి మరీ చర్చలు జరిపారు. అక్కడి వరకూ బానే ఉంది. ఆ తరువాతే వ్యూహకర్తకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. పీకే రాజకీయ ఆకాంక్షలకు గండి పడింది. ఏదో ఓపార్టీ పంచన చేరి రాజకీయంగా చక్రం తిప్పుదామనుకున్నా ఆయన చేరదీసే వారూ, దగ్గరకు రానిచ్చే వారే కరవయ్యారు. తెలుగు రాష్ట్రాలు తప్ప ఎన్నికల వ్యూహాల కోసం పీకే వైపు చూసే వారే కరవయ్యారు. ఏ పార్టీ దరికి చేరనీయకపోవడంతో అని వార్యంగా సొంత రాష్ట్రానికి వెళ్లి అక్కడ ప్రాంతీయ పార్టీ ప్రకటన చేసి.. అక్కడకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది.
ఆ తరువాత వంతు రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్. రాకేశ్ టికాయత్ పరిస్థితి కూడా కేసీఆర్ తో సాన్నిహిత్యం తరువాతే అగమ్యగోచరంగా మారిపోయింది. మోడీ తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన బ్రహ్మాండమైన ఆందోళనకు నాయకత్వం వహించిన టీకాయత్.. ఆ ఆందోళనకు మోడీ దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పి మరీ ఆ చట్టాలను ఉపసంహరించుకునేలా చేశారు. ఆ తరువాత కూడా ఆయన రైతు నాయకుడిగా తిరుగులేని ఆధిపత్యాన్నే అనుభవించారు. హైదరాబాద్ వచ్చి మరీ రైతు సభలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల నిప్పులు చెరిగారు. అక్కడి వరకూ ఆయనకు తిరుగేలేని పరిస్థితి ఎదురైంది. ఆ తరువాతే ఆయన సీఎం కేసీఆర్ తో హస్తినలో వేదిక పంచుకున్నారు. అక్కడ నుంచీ ఆయన కష్టాలు మొదలయ్యాయి.
కేసీఆర్ తో జత కట్టిన తరువాతే ఆయనకు అంత వరకూ సహచరులుగా ఉన్న రైతు నాయకులే ఆయనపై తిరుగుబాటు చేశారు. రాజకీయ పార్టీలతో, రాజకీయ నేతలతో అంటకాగుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఆయనపై దాడికి సైతం దిగారు. దీంతో ఇప్పుడు ఆయన వెంట రైతులు లేని పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఆయనే కేసీఆర్ వెంట తిరుగుతున్న పరిస్థితి. దేశంలో రైతుల పరిస్థితి, కేంద్రానికి వ్యతిరేకంగా వారికి మరోసారి ఉద్యమ కార్యోన్ముఖులను చేయడం తదితర అంశాలపై ఇటీవల ఆయన కేసీఆర్ ప్రగతి భవన్ లో రెండు రోజులు బస చేసి మరీ ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పుడు తికాయత్ కు కేసీఆర్ వెంట నడవడం వినా మరో మార్గం కనిపించడం లేదా అని పరిశీలకులు సైతం ప్రశ్నిస్తున్నారు.
ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది.
జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా కేసీఆర్ బీజేపీయేతర కూటమి, జాతీయ స్థాయిలో మరో పార్టీ ప్రతిపాదనలకు ఇసుమంతైనా స్పందించని సమయంలో కేసీఆర్ తో కలిసి అడుగు వేయడానికి ముందుకు వచ్చారు హేమంత్ సొరేన్. హైదరాబాద్ వచ్చి మరీ కేసీఆర్ తో రెండు రోజులు మంతనాలు జరిపారు. పనిలో పనిగా తన సన్నిహిత బంధువు వైద్యం కోసం కూడా కేసీఆర్ సలహాను, సహాయాన్ని అందుకున్నారు. రాజకీయంగా కేసీఆర్ తో కలిసి అడుగులు వేయనున్నట్లు చెప్పకనే చెప్పారు. అంత వరకూ బానే ఉంది. ఆ తరువాతే పరిస్థితి ఆయనకు ప్రతి కూలంగా మారింది. మైనింగ్ లీజు, అలాగే ఒక ప్లాట్ ఆయన భార్యపేరున రిజిష్టర్ చేయించుకున్నారన్న అవినీతి ఆరోపణలపై ఆయన నివాసం, ఆయన సన్నిహితుల నివాసాలపై ఈడీ దాడులు జరిగాయి.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి సోరేన్ సన్నిహితుడు, సాహిబంజ్ ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా సంబంధించిన నివాసాలపై దాడులు నిర్వహించింది. అలాగూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుల ఇళ్లల్లో సైతం ఈడీ దాడులు నిర్వహించింది. మొత్తం18 ప్రదేశాల్లో ఈడీ దాడులు జరిగాయి. ఈ దాడులు కూడా హేమంత్ సొరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ అయిన తరువాత జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కేసీఆర్ తో రాజకీయంగా ఎలాంటి సాన్నిహిత్యమైనా తమను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందన్న ఆందోళన రాజకీయ నాయకులలో వ్యక్తం అవుతోంది. కేసీఆర్ తో సాన్నిహిత్యం తరువాతే ఒకరి తరువాత ఒకరుగా ఇబ్బందుల్లో పడటం కాకతాళీయమే అయినా సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ రంగంలో ఇది కేసీఆర్ ను ఏకాకిగా మార్చే అవకాశాలే మిక్కిలిగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.