చీ ఛీ.. ఇదేం పాడు పని! అడ్డంగా బుక్కైన ఎమ్మెల్సీ
posted on Jan 30, 2021 @ 11:28AM
రాజకీయ నేతలు దిగజారిపోతున్నారు. ఏం చేస్తున్నామనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు. తమ పరువు తీసుకోవడంతో పాటు చట్ట సభల గౌరవానికి భంగం కల్గిస్తున్నారు.
ఇలాంటి ఘటనే కర్ణాటక విధాన పరిషత్లో వెలుగుచూసింది. విధాన పరిషత్ సమావేశంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తన ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయారు. శుక్రవారం విధాన పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ పాల్గొన్నారు. అయితే ఆయన సమావేశాలను పట్టించుకోకుండా సెల్ఫోన్లో అశ్లీల వీడియోలు చూడడంలో మునిగిపోయారు. ఓ టీవీ చానల్ కెమెరా దానిని చిత్రీకరించడంతో ఆ ఎమ్మెల్సీ బాగోతం వెలుగు చూసింది. విషయం బయటకు రావడంతో దుమారం రేగింది. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
అశ్లీల దృశ్యాలను చూస్తున్న ఎమ్మెల్సీ వీడియో మీడియాలో వైరల్గా మారింది. దీంతో తనకేం తెలియదంటూ బుకాయించారు ఆ ఎమ్మెల్సీ. తాను స్మార్ట్ఫోన్ను సభకు తీసుకెళ్లనని, తన ఫోన్ మెమొరీ ఫుల్ అయిందని, అందువల్ల తన ఫోన్లో ఉన్న కొంత పనికిరాని సమాచారాన్ని తొలగించానని చెప్పారు. క్వచ్ఛన్ అవర్లో చర్చించేందుకు అవసరమైన సమాచారం కోసం ఫోన్ను చూశానని, చాలా సందేశాలు, వీడియోలు ఉండటంతో వాటిని తొలగించానని తెలిపారు. మీడియాలో ఏం చూపించారో తనకు తెలియదని ఎమ్మెల్సీ రాథోడ్ సమాధానమిచ్చారు.
చట్టసభల్లో ఇలా అభ్యంతరకర వీడియోలు చూస్తూ సభ్యులు దొరికిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2012లో ముగ్గురు బీజేపీ మంత్రులు లక్ష్మణ సావాడి, సీసీపాటిల్, కృష్ణ పాలేమర్ ఇలానే అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. స్థానిక మీడియా ఆ వీడియోలను విస్తృతంగా ప్రచారం చేయడంతో సదరు మంత్రులు తమ పదవులకూ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కర్ణాటక బీజేపీకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఘటన తర్వాత అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించారు.చట్ట సభలను దేవాలయాలుగా భావించాల్సిన పదవిలో ఉండి నీచ పనులు చేస్తున్న ప్రజా ప్రతినిధుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.