వీర జవానుల విజయ కేతనం.. విజయ్ దివస్
posted on Jul 26, 2022 @ 12:39PM
జూలై26, 1999, కార్గిల్ పర్వత ప్రాంతాలలో భారత సేనలు సాధించిన మహోన్నత విజయానికి ప్రతీక. ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్ మాత్రమే కాదు, భారత సేనల అద్వితీయ ధైర్యసాహసాలు అత్యున్నత త్యాగాల విజయ గాధ మాత్రమే కాదు. దౌత్యపరంగానూ భారత దేశాన్ని అంతర్జాతీయ వేదికపై, బలీయమైన శక్తిగా నిలిపిన రోజు.అంతేకాదు, అంతర్జాతీయంగా మొదటిసారిగా పాకిస్థాన్ ను ఏకాకిని చేసిన రోజు. అలాగే, ఉగ్రవాదాన్ని పోషిస్తున్న ఓ అప్రజాస్వామిక దేశంగా పాకిస్థాన్’ ప్రపంచ దేశాల్ ముందు దోషిగా నిలబెట్టిన రోజు.
కార్గిల్ యుద్ధం, పుట్టు పుర్వోత్తరాలోకి వెళితే, పాకిస్థాన్ ప్రభుత్వం, అప్పటి ఆ దేశ అధ్యక్షుడు ముషారఫ్ కశ్మీర్ను అంతర్జాతీయ వివాదంగా చిత్రీకరించేసిన కుట్ర, పన్నిన పన్నాగం తప్ప మరేమే కాదు. కార్గిల్ యుద్దః అణు యుద్ధంమారే ప్రమాదం పొంచి ఉందనే భ్రమలు సృష్టించి, కశ్మీర్ వివాదంలోకి మూడవ దేశం తక్షణ జోక్యానికి అవకాశం కలిపించి, తద్వారా కశ్మీర్ను అంతర్జాతీయ వివాదంగా చిత్రీకరించాలని ముషారఫ్ ప్రధాన ఎత్తుగడ. అందుకోసమే, ఎల్ఓసీని ఉల్లంఘించి కార్గిల్లోని నియంత్రణ లేని ప్రాంతాలను ఆక్రమించాలి అనుకున్నారు. అయితే కార్గిల్ దాడి తర్వాత భారతీయ సైన్యం స్పందించిన తీరు పాకిస్థాన్ సైన్యం ఊహకు అందని విధంగా ఉండడంతో వారి ఆటలు సాగలేదు.
వ్యూహాటకమైన కార్గిల్ పర్వత ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా సమీప భవిష్యత్ లో మొత్తం జమ్మూ, కాశ్మీర్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం పాకిస్తాన్ కుట్రపూరితంగా, దొంగచాటుగా దెబ్బతీయాలని చేసిన ప్రయత్నాన్ని మన సేనలు అపూర్వమైన ధైర్యసాహసాలతో ఎదిరించారు. ప్రతికూలమైన పర్వత ప్రాంతాలలో మన సేనల పోరాట పటిమ మొత్తం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది.
ఆనాడు వాజపేయి, జార్జ్ ఫెర్నాండస్, జస్వంత్ సింగ్ – తిరుమూర్తుల నాయకత్వంలో మన ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించిన తీరు అనూహ్యం. 1971లో బాంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత మనం సైనికంగా, దౌత్యపరంగా సాధించిన మరో అసాధారణమైన విజయంగా చెప్పవచ్చు.
ఉగ్రవాదులతో పాటు వారి వేషధారణలో చొరబడి భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి కార్గిల్ కొండలను ఆక్రమించిన పాక్ సైనికులను భారతీయ సైనికులు తుదముట్టించారు. అణ్వాయుధ దాడి వంటి తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న భయంతో కూడా భారతదేశాన్ని భయపెట్టలేమని యావత్ ప్రపంచ సమాజం గ్రహించేటట్లు చేయగలిగారు. దేశ ఐక్యత, సమగ్రతను రక్షించే సమస్యలపై ప్రపంచంలోని ఏ అగ్రరాజ్యం ఒత్తిడికి లేదా ప్రభావానికి భారత్ లొంగబోదని స్పష్టం చేశారు.
కార్గిల్ యుద్ధం పాకిస్థాన్ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే రాజ్యంగా పూర్తిగా బహిర్గతం చేసింది. కార్గిల్ దాడిపై తనకు ఎలాంటి సమాచారం లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పగా, షరీఫ్కు అన్నీ తెలుసని ఆర్మీ చీఫ్ ముషారఫ్ పేర్కొంటూ దొంగాట ఆడారు.
కార్గిల్ గురించి షరీఫ్కు తెలుసో, తెలియదో గాని పాక్ సేనలకు తిరిగి భారత్ పై యుద్దానికి దిగలేని విధంగా గుణపాఠం చెప్పారు. సైన్యం చేసిన ఈ దుశ్చర్య గురించి ప్రధానికి నిజంగా తెలియకపోతే, పాకిస్థాన్కు సైన్యం లేదు, సైన్యంలో పాకిస్తాన్ ఉంది అని స్పష్టం అవుతుంది.మొత్తానికి ఈ దుస్సాహసం పాకిస్తాన్ ను జటిలమైన సంకటంలో పడవేసింది. మే 17న పాక్ సేనలు కార్గిల్ పర్వతాలపైకి చొచ్చుకు పోయేవరకు తనకు ఈ దాడి గురించి తెలియదని ఆ దేశం విదేశాంగ మంత్రి కూడా కలత చెందారు.పాకిస్తాన్ సైన్యంలో ఇంతటి గందరగోళం అంతకు ముందెన్నడు కలుగలేదు.
భారత్ అనుసరించిన అసాధారణమైన దౌత్య వ్యూహం కారణంగా కార్గిల్ శిఖరాల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ప్రపంచంతో పాటు తమకు బాసటగా మరోవైపు నుండి భారత్ పై యుద్దానికి దిగుతుందని అనుకున్న చైనా కూడా సేనలను వెనుకకు తీసుకెళ్లామని ఒత్తిడి చేయడంతో పాకిస్తాన్ దిగ్భ్రాంతి చెందింది.
కార్గిల్లో పోరాడుతున్న తమ సేనలు కాదని, ముజాహిదీన్లు అని మొదట పాకిస్తాన్ ప్రపంచానికి అబద్ధం చెప్పింది, కానీ ప్రపంచ ఒత్తిడిలో పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి పిలిచినప్పుడు, వారి కుట్ర ఏమిటో ప్రపంచానికి బట్టబయలైంది. పాకిస్తాన్ ముజాహిదీన్లను నియంత్రిస్తున్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణలు వాస్తవమని మొత్తం ప్రపంచం గ్రహించింది.
ముజాహిదీన్ పేరుతో కశ్మీర్ లోయలో పాక్ ఉగ్రరూపం దాల్చిందన్న వాస్తవం కూడా ప్రపంచ దేశాలకు అర్థమయింది. అంతర్జాతీయ వత్తిడి పెరగడంతో దిక్కులేక కార్గిల్ ఎత్తైన శిఖరాలలో పర్వేజ్ ముషారఫ్ తమ సేనలను దిక్కులేనివారిగా వదిలివేశారు.
ఆవిర్భవించినప్పటి నుంచి పాకిస్థాన్లో జవాబుదారీ వ్యవస్థ అంటూ లేదు. అరాచకమే రాజ్యమేలుతుంది. ఇంత పెద్ద పొరపాటుకు కారణమైన ఆర్మీ చీఫ్ ముషారఫ్ ఆ తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు కావడమే అందుకు నిదర్శనం. ఏమైతేనేమి, కార్గిల్ విఫల రాజ్యానికి మరో విఫల ప్రయత్నమని నిరూపించబడింది. 1965, 1971 యుద్ధాలలో ఓడిపోయినా పాకిస్తాన్ సైన్యం తన దుర్మార్గపు ఆలోచన మారలేదు. 1999 కార్గిల్ యుద్ధానికి ముందు రెండుసార్లు, పాకిస్తాన్ సైన్యం కార్గిల్ వైపు నుండి భారత్పై దాడికి విఫల విఫల ప్రయత్నం చేసింది.. మూడవ ప్రయత్నంలో యుద్దంలో ఓడి పలాయనం చిత్తగించింది.