బ్యాలెట్ లో విపక్షాల గుర్తులు మాయం.. పరిషత్ ఎన్నికల్లో గందరగోళం
posted on Apr 8, 2021 @ 11:54AM
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బ్యాలెట్ పేపర్లలో తప్పులు రావడంతో కొన్ని చోట్ల పోలింగ్ నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సాకుర్రుగున్నెపల్లె ఎంపీటీసీ ఎన్నికలో బ్యాలెట్ పేపర్ లో జన సేన సింబల్ మిస్సైంది. దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో పోలింగ్ కేంద్రంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బ్యాలెట్ పేపర్ పై జనసేన గుర్తు మిస్ అవడంపై పోలింగ్ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. పొరబాటున ఇలా జరిగి ఉంటుందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు. జనసేన మాత్రం అధికార పార్టీ కుట్రతోనే జనసేన గుర్తు లేకుండా చేసిందని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు పోలింగ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. బ్యాలెట్ పేపర్ పై విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థి ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు పోలింగ్ ను వాయిదా వేశారు.ఇక ముమ్మిడి వరం మండలంలో బ్యాలెట్ పేపర్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం కలకలం రేపింది.
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. సత్తెనపల్లి మండలం గోనెపూడిలో టీడీపీ ఏజెంట్లు, ఓటర్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కూడా వైసీపీకే సహకరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం, మాముడూరులో వైసీపీ ఏజెంట్లపై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం తెలపడంతో ఇరువర్గాల మధ్య ఘర్షన జరిగింది. రౌడీ షీటర్లను పోలింగ్ ఏజెంట్లుగా పెట్టారంటూ మహిళా అభ్యర్థి అభ్యంతరం చెప్పడంతో ఏజెంట్లు ఆమెపై దాడి చేశారు. దీంతో అధికారులు పోలింగ్ నిలిపేశారు.