తుగ్లక్, హిట్లర్, గోబెల్స్‌కు ప్రతిరూపం జగన్ ?

ఏది సత్యం, ఏది అసత్యం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనే అంశాలను ప్రజలు గుర్తించాల్సి వుంది. మరోసారి అధికారంలోకి రావడం కోసం చంద్రబాబుని అవినీతిపరుడుగా చిత్రించేందుకు ఏటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసు పెట్టి.. అన్యాయంగా  జైలులో పెట్టించి..  చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు జనాన్ని బురిడీ కొట్టించాలని చూస్తున్న దగా నాయకుడి చరిత్ర ప్రజలు తప్పక తెలుసుకోవాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్ధిక ఉగ్రవాదానికి పాల్పడిన ఆర్ధిక నేరస్థుడు ఎటువంటి నేరానికి పాల్పడని మచ్చలేని నాయకుడిపై అవినీతి ఆరోపణలు చెయ్యడం సిగ్గు చేటు. గాలి మంద గాలి ఆరోపణలు చేస్తున్నారు. ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో అవినీతికి పాల్పడి, ఏ స్థాయిలో కూడా నీతికి, నిజాయితీకి విలువ లేకుండా చేసి తెలుగువారంటే అంతా మోసం, దగా అన్న భావన ప్రపంచానికి కల్పించిన జగన్ రెడ్డి.. చంద్రబాబుని అవినీతి పరుడుగా చిత్రించడం చూసి ప్రపంచ వ్యాప్తంగా ప్రజానీకం ఛీ  కొడుతున్నారు. రెండవ సారి అధికారంలోకి రావడం కోసం ఆధారాలు లేని కేసులు పెట్టి చంద్రబాబును అవినీతి పరుడు గా చిత్రించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అవినీతి అంటూ చంద్రబాబుపై జగన్ గ్యాంగ్ చేస్తున్న రాద్దాంతం అంతా కూడా రాజకీయ దురుద్దేశంతోనే తప్ప మరొకటి మాత్రం కాదు. ఏ విధంగా అయినా ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనం పొందటానికేనని అర్ధమవుతుంది. 
ఒక పక్క రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడి కూడా అవినీతి గురించి సుద్దులు చెప్పడం అంటే అంతకన్నా మోసం మరోకటి లేదు. వైఎస్ఆర్ హయాంలో అంతా ప్రజల కోసమేనంటూ నిష్టగా సాగిన అవినీతి యజ్ఞంలో కొల్లగొట్టబడిన ప్రజాధనాన్ని నిగ్గు తేల్చడానికి దర్యాప్తు సంస్థలు ఎంతగా శ్రమ పడ్డాయో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలంతా సైతం చూశారు. రూ.43 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఏకంగా పెద్ద బొర్రే పెట్టినట్లు సిబిఐ తేల్చి 17 ఛార్జి షీట్లు వేసింది. అన్నీ ఛార్జిషీట్లలోను వైయస్ జగన్‌ని మొదటి ముద్దాయిగా తేల్చింది. తండ్రి అధికారానికి అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసి, రాష్ట్రాన్ని మాఫియా మయం చేసి లక్ష కోట్ల ప్రజాధనం దిగమింగిన ఘనుడీ జగన్ రెడ్డి. జగన్ ఆర్ధిక నేరాలు పలు దేశాలకు సైతం విస్తరించాయని న్యాయస్థానాలు సైతం నివ్వెరపోయాయి. అవినీతిపరులను దీప స్తంభాలకు ఉరి తీయాలని తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు చట్టబద్దంగా అలా ఆదేశించే వీలు లేకపోయిందంటూ కొన్నేళ్ళ క్రితం బాధ పడింది, అలాగే చైనా జాతీయుడిగా వైయస్ జగన్ ఇంత దోపిడీకి పాల్పడి వుంటే అక్కడ అతనికి నిర్ధాక్షిణ్యంగా మరణ శిక్ష అమలు జరిగేది. ప్రపంచంలో మరే ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో అయితే జగన్ బతుకు శంకరగిరి మాన్యాలు పట్టి వుండేది. అయినా జగత్ కిలాడి అయిన జగన్ రెడ్డి తానే నిజాయితీ పరుడుగా అమాయక జనం చెవిలో పూలు పెడుతున్నాడు. 

గతంలో ముంబయిని వణికించిన మాఫియా శక్తుల్లో అరుణ్ గావ్లీ ఒకడు. తరువాత అరుణ్ గావ్లీ 1997లో అఖిల భారతీయ సేన పేరిట ఓ రాజకీయ పార్టీ స్థాపించి 2004 లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయితే అతడి పాపం పండి నేడు జైల్లో వున్నాడు. సమాజానికి చీడ పురుగుల్లాంటి అరుణ్ గావ్లికి, జగన్ గ్యాంగ్‌కి ఎందులోనూ తేడా లేదు. తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాక ముందు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వుందని మొర పెట్టుకున్న కుటుంబం,  కర్నాటకలో 22.5 మెగావాట్ల చిన్న సెకండ్ హ్యాండ్ విద్యుత్ ప్లాంట్ 1998లో ఎవరి దగ్గరో కొని 2004 వరకు దాంతో కుస్తీలు పడుతున్న పుత్రరత్నం దశ  అయిదేళ్లలో తిరిగి వేల కోట్ల రూపాయల విలువ చేసే బహుముఖ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందంటే అది అంతా రాష్ట్రాన్ని ఏడాపెడా దోచిన దురాగతం కాదా? జగన్ బొక్కింది గాలికి పోయే పేలాల పిండి కాదని, ప్రజలకు దక్కాల్సిన వేల కోట్ల ప్రజాధనమని జగన్ గ్యాంగ్ గుర్తించాలి,  జలయజ్ఞం, గనులు, సెజ్‌లు, కారిడార్లు, పోర్టులు, నాలెడ్జ్ హబ్‌లు, లేపాక్షి, ఒడిస్సీ, ఎకనామిక్ సిటీలు, రస్ అల్ ఖైమా, ఎమ్మార్..  ఇలా రాజావారి కన్ను పడ్డ ప్రతిదీ కుంభకోణమే. ఏమీ జరగని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏదో జరిగిపోయిందని తన ముందుకు వస్తే నోరు పట్టే వారిని, వెనక్కి వస్తే దోచేళ్లు పట్టేవారిని ఊరూరు పంపించించి ప్రెస్ మీట్లు పెట్టించి చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ప్రచారం చేయిస్తున్నాడు. 

తన తండ్రి వైఎస్ఆర్ వివిధ రూపాల్లో అవినీతి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సత్ పరిపాలనా సూత్రాలను, రాజ్యాంగ యత్రాంగాలను కాల రాసిన భ్రష్ట చరిత్ర వైఎస్‌ఆర్‌ది. జగన్ దాచింది అంతా జనాన్ని దోచిందే. రాష్ట్ర సర్వతొ ముఖాభివృద్దికి దోహద పడాల్సిన వనరులతో హవాలా నడిపి లెక్కలేనన్ని బినామీ కంపెనీలతో చట్టం కళ్ళు కప్పి నేర పూరిత కుట్రలకు పాల్పడిన జగన్ నేడు పత్తిత్తు మాటలు చెబుతున్నారు. రాజకీయ డ్రామాలు రక్తి కట్టించడంలో జగన్ అభినవ నటుడు ,ఆయన జగన్నాటకం ముందు పగటి వేషం అనేక కళారూపం వెనకబడి పోయింది. ఎంతగా నటిస్తే అంతగా రాజకీయం పండుతుందని జగన్ ఆశ. ప్రజల్ని ఏదో విధంగా మోసం చెయ్యడమే ఆయన లక్ష్యం. చట్ట బద్ద పద్దతుల్లో, ప్రజ్ఞా పాటవాలతో ఎవరు ఎదిగినా.. ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎల్లవేళలా రాష్ట్ర  ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎల్లలెరుగని కుంభకోణాలతో జన ఖజానాకు చెందాల్సిన సమస్తాన్ని తన కుటుంభానికి దోచిపెట్టిన తీరు నభూతో... అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాదనం దోపిడి తప్ప ప్రజాసేవ అంటే ఏమిటో తెలియని జగన్...  జనం కోసమే పుట్టినట్టు జగన్నాటకాలు ఆడుతున్నాడు. 

అక్రమంగా తన తండ్రి తవ్విపోసిన మంది సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకొని నీతులు చెప్పడం సిగ్గు చేటు. నాలుగేళ్ల క్రితం వరకు ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిబడిన పెద్దమనిషి, ఆస్తులు జప్తు చేయించుకున్న జగన్ రెడ్డి.. చంద్రబాబు అవినీతి పరుడుని  ప్రజలను నమ్మించడానికి ఎన్నో..ఎన్నేన్నో అవస్థలు పడుతున్నారు. ముస్సోలినీ, సద్దాం హుసేన్, ఇడీ అమీన్, హిట్లర్ ఆలోచనల ప్రతి రూపమే వైయస్ జగన్ అని చెప్పాలి. అధికార గర్వంతో, లెక్కలేని తనంతో, రాక్షస పాలన సాగిస్తున్నారు. అహంకారులకు గర్వపోతులకు ప్రజల చేతిలో శృంగభంగం తప్పదు. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే, విమర్శించే హక్కు ప్రతిపక్షానికి, పౌరులకు రాజ్యాంగం కల్పించింది.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్టికల్ 19ని అడ్డుకొనే చట్టమే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు శాంతి యుతంగా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు నిర్వహించరాదంటూ అనుమతి నిరాకరించడం దుర్మార్గపు చర్య. జగన్‌ పరిపాలనలో ప్రజాస్వామ్యానికి  పెడరెక్కలు విరిచే వికృతం విశ్వరూపం దాల్చింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరసనలు, దర్నాలు, దీక్షలు నిర్వహించే హక్కు కూడా లేకపోతే ఇది ప్రజా స్వామ్యమా? జగన్ స్వామ్యమా?  రాష్ట్రం ఏమన్నా జగన్ జాగీర్ అనుకొంటున్నారా? జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 144  సెక్షన్, 30 యాక్టు నిరంతరం అమలు చేస్తూనే వున్నారు. తానూ ప్రతి పక్షంలో వున్నప్పుడు అనేక  రోజులు రోడ్లపై పాద యాత్రలు, దీక్షలు చేశారు? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకొంటే జగన్ రెడ్డి పాద యాత్ర  చేసే వారా? స్వాతంత్రోద్యమంలో కానీ, 1975 నాటి ఎమర్జెన్సీలో కానీ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, ఏపీలో నయా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని, ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లారా చూసిన పెద్దలు చెబుతున్నారు. ఇందిరాగాంధీ  ఎమర్జెన్సీ విధించినా, పౌర హక్కులను కాలరాసినా ప్రజలు  రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపినా  పోరాటాలు ఆగలేదు. కానీ ఇప్పుడు ఊరూరా పోలీసులే. హౌస్‌ అరె‌స్టులు చేస్తూ ఇళ్లనే జైళ్లుగా మార్చేస్తున్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టడం అంటే  రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్ధం అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సామాన్యులనూ వేధిస్తున్నారు. లాఠీ చార్జీ చేయడం, నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జగన్‌ ఏలుబడిలో జగన్ రెడ్డి  రాజ్యాంగం అమలవుతోంది. ఐపీసీ కాదు. వైసీపీ చట్టం అమలవుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో ఎమర్జెన్సీలో మాత్రమే రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులు హరించాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీకి మించిన అణచివేత కొనసాగుతోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ బోర్డర్‌ను తలపించే విధంగా వందల మంది పోలీసులను, పారా మిలటరీ బలగాలను మోహరింప చేయడం దారుణం. అక్రమ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు కుటుంబానికి  మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి బయలుదేరిన ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని అడ్డుకోవడానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం సర్వ శక్తులు ఒడ్డింది. అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. తెలంగాణ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేశారు. ఎక్కడిక్కడ కార్లను ఆపేసి, రోడ్డు పక్కకు నిలిపేశారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అంటూ ప్రశ్నలు సంధించి మరీ వేధించారు. అయినా హైదరాబాద్‌లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు పట్టువదలని విక్రమార్కుల్లా అడ్డంకులు ఛేదించుకొని రాజమండ్రికి చేరుకొని నారా బ్రాహ్మణిని కలసి తమ మద్దతు తెలిపారు. 
 
జగన్ ప్రభుత్వం ఘోరంగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షానికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక, అక్కసుతో, దుర్భుద్దితో చంద్రబాబు అరెస్ట్‌కు ప్రతిగా జరుగుతోన్న నిరసనలు, దర్నాలు, దీక్షలు, ర్యాలీలను అడ్డుకొంటున్నది. ప్రతిపక్షాల స్వేచ్చకు గోరీ కట్టే  నిరంకుశ ధోరణికి సమాధి కట్టకపోతే ప్రజాస్వామ్యం  మనుగడ సాగించదు. స్వార్ధంతో ఎంతటి నీచ చర్యకైనా వెనకాడని విపరీత మనస్తత్వం గల జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా పాలన సాగిస్తామని ప్రమాణం చేసి అధికార పీఠం అధిష్టించిన జగన్ రెడ్డి ఆ ప్రమాణాన్ని పాతాళంలో పాతరేశారు. జగన్ ఫాసిస్ట్ క్రూర మనస్తత్వానికి అధికారం తోడు కావడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం మంటకలిసి పోతుంది. ప్రభుత్వం మాదే, వ్యవస్థలు మావే, మేము చేసిందే చట్టం, మేము చేసేదే పరిపాలన అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వానికి ఎవ్వరూ ఎదురు రాకూడదని, తమకు అందరూ భయపడాలని నిరంకుశంతో, నిర్భందాలతో పాలన సాగిస్తున్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దానిని ఎవ్వరు అతిక్రమించరాదని . సభలు, సమావేశాలు, ప్రదర్శనలు జరిపే హక్కు రాజకీయ పక్షాలకు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాలకులు నిరంకుశంగా, నా ప్రభుత్వం నా ఇష్టం అన్న విధంగా వ్యవహరిస్తుంటే ప్రజలు, ప్రతిపక్షం మాత్రం చట్టాలను, జీవోలను ఎందుకు గౌరవించాలి?  

రాజ్యాంగ అధినేతగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌దే. రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్రంలో పాలన లేనప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌దే. రాష్ట్రంలో పరిణామాలను గవర్నర్ ఉపేక్షించ రాదు. ప్రజాస్వామ్యాన్ని చెల్లని కాసుగా మార్చిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానిదే. అఖిల భారత సర్వీస్ అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని,  చట్టాలను కాపాడతామని ప్రమాణం చేస్తారు. కానీ నేడు ప్రజా ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తూ రాజ్యాంగ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని ఐ ఏ ఎస్,ఐపిఎస్ అధికారులు  గుర్తించకపోవడం బాధాకరం. 

ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. ప్రభుత్వాలు ఐదేళ్లకొక సారి మారుతోంటాయి. వీరు మాత్రం 60 ఏళ్ళు పదవుల్లో కొనసాగుతారు. అఖిల భారత సర్వీసు అధికారులకు రాజ్యాoగ నిర్మాతలు కల్పించిన హక్కులు, అధికారాలు సామాన్యమైనవి కావు. కానీ చట్టానికి,రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాధ్యత లేకుండా పనిచేస్తూ వ్యక్తి గుర్తింపు కోసం, ప్రమోషన్లకు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు. శాంతియుత ప్రదర్శనలకు సభలకు, ర్యాలీలకు అనుమ్మతులు నిరాకరించడం, ముందస్తు అరెస్ట్‌లకు పాల్పడటం, గృహ నిర్బంధాలు వంటి నిరంకుశ చర్యలతో పాలన సాగిస్తున్నారు. అధికార పార్టీ దన్నుతో పోలీసులు అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ రెడ్డి అహంకారంతో, ప్యూడలిస్ట్ స్వభావంతో పరిపాలన సాగిస్తున్నారు.

ఇప్పటికే జగన్ ప్రభుత్వ, వేధింపులు, సాధింపులు, నియంతృత్వంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి అడుగులకు మడుగులోత్తుతూ ప్రజల, ప్రతిపక్షాల హక్కులను హరించడం మంచిది కాదని గుర్తించాలి. రాష్ట్రంలో పోలీసులు నేరం చేసిన వారిని కాపాడుతున్నారు. భాదితుల పక్షాన నిలుస్తున్న ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజలకు విధేయులుగా వుండాల్సిన పోలీసు వ్యవస్థ పాలకులకు విధేయులుగా వున్నామని నిరూపించుకోవడానికి పోలీసు వ్యవస్థ అంతులేని ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నది. ప్రజల తిరుగుబాటుతో ప్రపంచ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపొయారు. జగనొక లెక్క కాదు. ప్రజలు ఇప్పటి వరకు సహనంతో  వున్నారు. ఇంక ప్రజలు సహించే పరిస్థితి లేదు. ప్రజల చేతిలో ఓటమి శిక్షకు జగన్ గ్యాంగ్ అంతా సిద్ధంగా ఉండాలి. ప్రజాస్వామ్య పెడరెక్కలు విరిచే ధోరణిని అరికట్టాలి. ఏది ఏమైనా రాష్ట్రంలో ఒక హిట్లర్, ఒక తుగ్లక్, ఒక గోబెల్స్‌లకు ప్రతిరూపంగా అయిన పరిపాలన సాగుతుందని,ప్రజలు,ప్రజాస్వామ్య వాదులు అంటున్నారు. 


నీరుకొండ ప్రసాద్

9849625610

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.