జగన్‌రెడ్డి గానుగెద్దులా ఐపీఎస్, ఐఏఎస్‌లు?

జగన్‌రెడ్డి ఆదేశాలకు తలొగ్గి గాను గెద్దుల్లా పని చేస్తున్నారు ఐఏఎస్, ఐపిఎస్‌లు అధికారులు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు రావడమే తరువాయి సీఐడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రతిపక్షనాయడు చంద్రబాబుపై కేసులు పెట్టడానికి పరుగెత్తుకు వస్తున్నారు. అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వేయాలని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నిర్ణయించడం తప్ప రోడ్డు వేయలేదు. కనీసం దాని కోసం భూ సేకరణ కూడా చేయలేదు. రోడ్డే లేకుండా రూ.2 వేల కోట్ల కుంభకోణం అంటూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆయన ఆదేశాలతో ఆధారాలు లేకుండా ఊహలతో సిఐడి అధికారులు కేసులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి  తలుచుకుంటే కనీస ఆధారాలు లేకపోయినా ఎవరిపైన అయినా కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించ వచ్చునని జగన్మోహన్‌ రెడ్డి రుజువు చేశారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించి ఏ ఆధారాలు చూపకుండా ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో నిర్బంధించారు. మళ్ళీ ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోఅరెస్టు అయి జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డ్ ఎలైన్‌మెంట్ కేసులో సిఐడి అధికారులు పీటీ వారంట్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరుగుతుండగానే సంబంధం లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్డ్ కేసులో లోకేష్‌ను నిందితుడుగా చేర్చారు. ఒక దాని తర్వాత మరొకటి అన్నట్లు అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును, లోకేష్‌లను ప్రజల్లోకి వెళ్లకుండా చెయ్యడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కుట్రలకు తెర లేపింది. 
ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో సీఐడీ మోపిన కేసుపై తెలుగుదేశం పార్టీ  సవివరంగా  నివేదిక విడుదల చేసింది. 

సీఐడీ తప్పుడు ఆరోపణలకు నిర్దిష్టంగా సమాధానాలిచ్చింది. ఇది రాజకీయ ప్రేరేపితం,కల్పితం తప్ప వాస్తవాల ఆధారంగా పెట్టిన కేసు కాదని స్పష్టం అవుతున్నది. ఊరూ పేరూ లేని వారి తరపున థర్డ్‌ పార్టీ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయవచ్చా? అలా అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిర్ణయం వల్ల తమకు నష్టం జరిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు పెడతారా? వాటి వల్ల అయాచితంగా లబ్ధి పొందిన వారు ఎవరో నిర్ధారించకుండా కేసులు పెట్టుకుంటూ పోతే అధికార యంత్రాంగం పని చేయగలదా? స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలదా? పరిపాలన పక్కన పెట్టి చంద్రబాబు, లోకేష్‌లను ఏయే కేసులలో ఇరికించేందుకు, కేసులను శోధించడమే జగన్‌ ప్రభుత్వం దినచర్యగా మారింది. 

    
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రజా రాజాధాని నగర నిర్మాణానికి సింగపూర్‌కు చెందిన ప్రభుత్వ సంస్థ మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చింది. ఆ తర్వాత రాజధాని నగర ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కోసం సీఆర్‌డీఏ ఆరు నెలలకు పైగా సంప్రదింపులు జరిపింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ పూర్తి పారదర్శకంగా జరిగింది. దాదాపు 1100 మందిని సంప్రదించి వారి అభిప్రాయాలు క్రోడీకరించి రూపొందించారు. అయినా ముఖ్యమంత్రి జగన్ మెప్పుకోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిరాధార అసంబద్ధ ఆరోపణలతో సిఐడికి పిర్యాదులు చేస్తూనే వున్నారు. అమరావతిని అటకెక్కించి, మాస్టర్ ప్లాన్‌ను తుంగలో తొక్కేశారు. గీతల్లోనే ఉన్న ఇన్నర్ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌పై అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై ప్రభుత్వం సీఐడీ కేసు పెట్టడం చూస్తే  జగన్ రెడ్డి ఎంత కక్షతో రగిలి పోతున్నారో అర్ధం అవుతుంది. ఇంత వరకు ఇన్నర్ రింగ్‌ రోడ్డు విషయంలో ఆరోపణలు రాలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత అసలే లేదు. గతంలో అలైన్‌మెంట్‌ నిర్ణయించినప్పుడు గానీ. ఆ తర్వాత గానీ వచ్చిన అభ్యంతరాలు కూడా లేవు. అక్రమ కేసులకు ఆంధ్రప్రదేశ్ సిఐడి కార్యాలయం అడ్డాగా మారింది. సిఐడికి గాలి పోగేసి.. గాలి కేసులు పెట్టడం అలవాటుగా మారింది. కేసులు పెట్టడానికి ఏమి దొరక్క ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు, అవినీతి అంటూ మరొక నాటకానికి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీ పిర్యాదు చెయ్యడమే ఆలస్యం విచారణ లేకుండా ప్రతిపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా పని చేస్తున్నదీ సిఐడి. 
రాజధాని అమరావతి కోసం పైసా ఖర్చు లేకుండా దాదాపు 30 వేల ఎకరాల భూమిని సమీకరించడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా జరిగిందని దేశవ్యాప్తంగా ప్రశంసలు సైతం వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆ పని చేశారు కనుక రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట భూ కుంభకోణం జరిగిందన్న ప్రచారాన్ని ఎత్తుకున్నారు 

సీఐడీ అధికారులు ఏదో ఒక కేసు నమోదు చేయడం, దానిపై చంద్రబాబు కోర్టులను ఆశ్రయించవలసి రావడం జరుగుతూనే ఉంటుంది. అత్యున్నతమైన ఐపిఎస్‌ల, ఐఏఎస్‌ల వ్యవస్థ జగన్‌రెడ్డి ఇంటి ముందు గానుగెద్దులుగా పని చేస్తున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల్లో విలువలు క్షీణించి ముఖ్యమంత్రి అభీష్ట కామ్యార్ధ సిద్ది కోసం గులాం గిరి చేస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చారు. అఖిల భారత సర్వీస్ చట్టం ప్రకారం ఈ అధికారులకు విశేషాధికారాలు వున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని. చట్టాలను గౌరవిస్తామని ప్రమాణం చేస్తారు. కానీ నేడు ప్రజా ప్రయోజనాలు. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తూ, నిజాయితీతో రాజ్యాంగ నిబంధనలు పాటీంచాల్సిన అవసరాన్ని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు గుర్తించడం లేదు. 

అఖిల భారత సర్వీస్ అధికారులకు రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కులు. అధికారాలు సామాన్యమైనవి కావు. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకొన్నా అడ్డుపడే అధికారం బిజినెస్ రూల్స్ రూపంలో ఐఏఎస్‌లకు దాఖలు పడింది. నిబంధనలు ఒప్పుకోవంటూ ముఖ్యమంత్రుల పార్మెంట్‌నే సున్నితంగా తిరస్కరించిన అధికారుల శకం అంతరించి రాజకీయ బాసులతో కలసి అవినీతి మడుగులో ఈదులాడటం, ప్రతిపక్షాలను వేధించడం, సభలను అడ్డుకొనే సంతతి నేడు ప్రజాస్వామ్య నవనాడులను కుళ్లబొడుస్తోంది.. కానీ ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్, ఐపిఎస్‌లు జగన్ ప్రభుత్వానికి వీర విధేయత చూపించి వీర గంధాలు పూస్తున్నారు. ఏ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఇంత నీచంగా వాడుకొన్న పరిస్థితి   లేదు. ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైంది, ఆర్ధికంగా దివాళా తీసింది. పాలన పరంగా చిన్నాభిన్నమైంది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను బలి పెడుతున్న ప్రభుత్వానికి ఐఏఎస్, ఐఫిఎస్ అధికారులు సహకరిస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం నేలబారుగా వ్యవహరించి దేశంలోనే అత్యున్నత అఖిల భారత సర్వీస్ వ్యవస్థకు తలవంపులు తేవడం మానుకోవాలి. ముఖ్యమంత్రి మెప్పుకోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల సంఘం కూడా దిగజారిన ప్రస్తుత వ్యవస్థ పనితీరును చక్కదిద్దెందుకు నడుం బిగించే చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది.        

 నిబద్దతతొ పనిచేసే యంత్రాంగం అంతరించి స్వామి కార్యంతొ పాటు స్వకార్యాన్ని సాధించుకొంటూ తరిస్తున్నారు. ప్రతిష్టాత్మక సివిల్.సర్వీస్ వ్యవస్థలో రుగ్మతలు రూపు మాపి.. విలువలు పునరుద్దరించాలని. తాము కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని పునరుద్దరించు కొవాలని, దాపరికం లేని విధానాలు అవలంభించాలని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సదస్సులో  తీర్మానించి ఏళ్ళకు ఏళ్లు గడిచింది. ప్రభుత్వానికి చుక్కానిగా  వ్యవహరించవలసిన సివిల్ సర్వీస్ అధికారుల వ్యవహర శైలి మార్చి వ్యవస్థనే రాజకీయ సాధనంగా దిగజార్చిన వైనం తాలుకా దుష్పలితాలు జగన్ పాలనలో కళ్ళకు కడుతున్నాయి. అధికారులు రాజకీయ దినుసులుగా మారడం వల్లనే పాలనలో నైతిక ప్రమాణాలు  దిగజారాయి. నేడు జగన్ పాలనలో ఐ.ఏ.ఎస్. ఐపిఎస్‌ల ప్రతిష్టకు గ్రహణం పట్టించారు. జగన్ పాలనలో పౌరసేవలు రాజకీయ సర్వీసులుగా మారిపొయిన వాస్తవాలు ఎన్నో కళ్ళకు కడుతున్నాయి. ఒత్తిళ్లను  ప్రతిఘటించ లేని ఐ.ఏ.ఎస్. ఐ. పి.ఎస్‌లు సర్వీస్‌లో కొనసాగడం వల్ల ఎవరికి ప్రయోజనం.  ప్రజల, రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాకుండా తమ ప్రయోజనాలే పరమావధిగా వ్యవరించడం అఖిల భారత సర్వీస్ వ్యవస్థకే అవమానకరం. పాలకులకు గులాంగిరి చేసే బదులు ప్రజలకు. విధేయులుగా ఉంటే ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులను ఎవరూ ఏమి చేయ్యలేరు. అంతేకాదు.. అటువంటి వారికి ప్రజలే అండదండగా ఉంటారన్నది మాత్రం వాస్తవం. 

గతంలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు పై పెత్తనం చెయ్యడానికి రాజకీయ నాయకులు భయపడే వారు. ఆయా అధికారులు కూడా నిబద్దతతో నిజాయితీగా ప్రజల కోసం కష్టపడే వారు. ఇప్పుడు పోస్టింగులు కోసం అడ్డమైన పనులు చెయ్యడానికి కూడా ఆలిండియా సర్వీస్ అధికారులు వెనకాడటం లేదు. కీలక పోస్టింగ్‌ల కోసం పాలకుల అడుగులకు మడుగులోత్తే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఫలితంగానే ప్రతిపక్షాలపై కక్ష సాధించేందుకు ప్రభుత్వానికి ఉపయోగ పడుతున్నారు. తన పేరిట జీఓలు జారీ చేసే అధికారాన్ని ప్రభుత్వ కార్యదర్శులైన ఐఏఎస్‌లకు గవర్నర్ వ్యవస్థ కట్టబెట్టడం వారిపై ఉన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. తమపై అంతటి నమ్మకంతో అధికారం కట్టబెట్టిన విషయాన్ని ఐఏఎస్‌లు విస్మరించడం ఎంత వరకు సమంజసం? ముఖ్యమంత్రి చెప్పాడని నిబందనలకు విరుద్దంగా జీఓలు జారీ చేసే పక్షంలో అందుకు ఐఏఎస్ అధికారులు ఎందుకు? సాధారణ ఉధ్యోగులు కూడా సరిపోతారు కదా? జగన్ పాలనలో ఐపిఎస్‌లు.. వై పీఎస్‌లుగా, ఐఏఎస్‌లు.. అయ్యా ఎస్‌లుగా మారి పోయ్యారు. ప్రభుత్వం ఇష్టాను సారం, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యమంత్రి మెప్పు కోసం అత్యున్నత ఐఏఎస్ అధికారి నెలబారుగా వ్యవహరించడం భాధ్యతా రాహిత్యం. ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన అధికారులు పాలకులకు విధేయులుగా మారడం వల్లనే జగన్ పాలనలో  ఐఏఎస్, ఐపిఎస్‌ల పని తీరు పూర్తిగా మసక బారింది.     

ఐఏఎస్ అధికారులను కోర్టుకు పిలిపించడమే కాదు న్యాయస్థానం జైలు శిక్షలు విధించింది. తమ ఆదేశాలను లెక్క చెయ్యని అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీ  ఒత్తిళ్లకు లొంగి పోయి తప్పులు చేస్తూ హైకోర్టుతో చీవాట్లు తిని, శిక్షలు వేయించుకొని అఖిల బారత సర్వీసుల వ్యవస్థను చులకన చేశారు. ఆ మధ్య రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు అయ్యేలా చూడాలంటూ రాష్ట్ర డీజీపీని హైకోర్టుకు పిలిపించి మరీ చెప్పాల్సి వచ్చిందంటూ  పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. పోలీసు అధికారులు, అధికారుల్లా కాకుండా జగన్ జేబు సంస్థగా మారడం వల్లనే ఈ దుస్థితి. పోలీసు వ్యవస్థను అదుపు చెయ్య లేకపోతే డిజిపి రాజీనామా చేయాలని కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. గతంలో కూడా అధికారంలో వున్న పార్టీలకు ఐఏఎస్,ఐపిఎస్‌లు అనుకూలంగా వ్యవహరించడం సహజమే. కానీ ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్, ఐపిఎస్‌లు జగన్ ప్రభుత్వానికి  వీర విధేయత చూపించి వీర గంధాలు పూస్తున్నారు. ఏ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను, ఐఏఎస్‌ల వ్యవస్థను ఇంత నీచంగా వాడుకొన్న పరిస్థితి  లేదు. ఆంధ్రప్రదేశ్ అస్త వ్యస్తమైంది, ఆర్ధికంగా దివాళా తీసింది. పాలన పరంగా చిన్నాభిన్నమైంది. 

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను బలి పెడుతున్న ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారులు సహకరిస్తున్నారు. ఐ ఏ ఎస్ అధికారులు అధికార పార్టీ నాయకుల ఆదేశాలను గుడ్డిగా ఆచరించే విధానానికి స్వస్తి చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. సొంత ప్రయోజనాల కోసం నెలబారుగా వ్యవహరించి అత్యున్నత అఖిల భారత సర్వీస్ వ్యవస్థకు తలవంపులు తేవడం మానుకోవాలి. ముఖ్యమంత్రి మెప్పుకోసం అత్యున్నత వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చ కండి. అఖిల భారత సర్వీస్ అధికారుల సంఘం కూడా దిగజారిన ప్రస్తుత వ్యవస్థ పనితీరును చక్కదిద్దడానికి ప్రయత్నించాలి. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారితే ఐపిఎస్‌లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  

                                                                                                                                                                 నీరుకొండ ప్రసాద్ 
9849625610

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.