Read more!

కవిత జైలు కెళ్లి సరిగ్గా  నెలరోజులు.. అయినా పరామర్శించని తండ్రి కెసీఆర్ 

ఒక్క నెల. కేవలం ఒక్క నెల ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిన మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కవిత పూర్తిగా మారిపోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులు. జైలులో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభ కలిసినా, తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను పరామర్శించకపోవడమే కాకుండా ఆ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
కవితలో ఉన్న మునుపటి కాన్పిడెన్స్ కనిపించడం లేదు. పీక్కుపోయిన ముఖం, జైల్లో హెయిర్ డై వేసుకోకపోవడంతో నెరసిన జుట్టు కనిపిస్తోంది. మానసికంగా ఎంతో స్ట్రాంగ్ అయిన కవిత అరెస్ట్ అయినప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ నెల రోజుల తర్వాత సిబిఐ అధికారులు  కస్టడీలో ఉన్నప్పుడు మాత్రం బేలగా కనిపించారు.  తాను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కెసీఆర్ ఢిల్లీ పెద్దలను కలిసినప్పటికీ ఈ నెల రోజుల్లో ఏ ఒక్కరినీ కలవలేదు. పైగా అరెస్ట్ వ్యవహారాన్ని కుటుంబసభ్యులు తీహార్ జైలులో పలుమార్లు కలిసినప్పటికీ కెసీఆర్ ఇంతవరకు కలవకపోవడం గమనార్హం. కనీసం అరెస్ట్ వ్యవహారాన్ని ఖండించకపోవడం రాజకీయ ఎత్తుగడ అని పరిశీలకులు భావిస్తున్నారు. 

లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను గత నెల 15న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. గత 20 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్న కవితను ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసి మూడు రోజులు విచారించింది. నేటితో ఆమె కస్టడీ ముగియనుండడంతో తిరిగి ఆమెను తీహార్ జైలుకు పంపనున్నారు. 

ఉదయం 10 గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరుస్తారు. ఈ సందర్భంగా కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరే అవకాశం ఉంది. ఒకవేళ సీబీఐ కనుక కస్టడీ పిటిషన్ వేయకుంటే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.