హైదరాబాద్ లో మాస్క్ లేకుంటే 2 వేల ఫైన్
posted on Mar 29, 2021 @ 5:09PM
తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ పంజా విసురుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. గత పది రోజుల్లోనే 15 వందల వరకు కొత్త కేసులు వచ్చాయి. కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్... కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే భారీగా ఫైన్ వేస్తోంది. అంతేకాదు షాపుల్లోకి మాస్కు లేనివారిని అనుమతి ఇస్తే.. షాపు ఓనర్లకు జరిమానా విధిస్తోంది. ఫతేనగర్లో మాస్క్ లేకుండా కస్టమర్స్ను షాపులోకి అనుమతించిన ఓ షాపు యజమానికి 2 వేల జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించింది. కొవిడ్ నిబంధనల అమలులో భాగంగా.. మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రాంతాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005లోని 51 నుంచి 60 సెక్షన్లతో పాటు ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ చట్టాల ప్రకారం రూ.1000 జరిమానాతో పాటు ఆరునెలల జైలు శిక్ష విధించే అధికారం ఉంది. హోలీ వేడుకలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిషేధించింది. షబ్-ఏ-బరాత్, ఉగాది, శ్రీరామనవమి, మహవీర్ జయంతి, గుడ్ ప్రైడే, రంజాన్ వేడుకలపైనా ఆంక్షలు విధించింది.