కాశ్మీర్ వేర్పాటువాది గిలానీకి పాక్ అత్యున్నత పురస్కారం
posted on Jul 28, 2020 @ 4:38PM
జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాద నాయకుడు, కాశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించిన సయ్యద్ గిలానీని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం.. అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్ -ఈ- పాకిస్తాన్’ అవార్డును ప్రకటించింది. గిలానీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడంతో వేర్పాటు వాదులకు పాక్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్ధం అవుతుంది.
అయితే భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసినా.. దానిని ఓ ఎజెండాగా మార్చడంలో గిలానీ విఫలమయ్యారంటూ పాక్ అప్పట్లో ఈయనపై గుర్రుగా ఉంది. కానీ, మనసు మార్చుకున్న పాక్ గిలానీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చింది. ఆర్టికల్ 370 ని రద్దు చేసి, జమ్మూ కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి, ఓ సంవత్సరం పూర్తికావడానికి వారం ముందే పాక్ ఈ అవార్డును వేర్పాటువాది గిలానీకి ఇవ్వడం గమనార్హం.
పాకిస్తాన్ లో హురియత్ కాన్ఫరెన్స్ ను స్థాపించి కాశ్మీర్ లో వేర్పాటు వాదాన్ని గిలానీ ప్రోత్సహించాడు. గిలానీ కొద్ది రోజుల కిందటే హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ పదవి నుంచి పక్కకు తప్పుకున్నాడు. సంస్థలో జవాబుదారీతనం లోపించిందని, సభ్యుల్లో తిరుగుబాటు తనం పెరిగిపోయిందని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు.