ఏఐ సొల్యూషన్ పేరుతో రూ.వెయ్యి కోట్ల మోసం!
posted on Sep 12, 2025 @ 10:08AM
హైదరాబాద్లో మరో భారీ ఇన్వెస్ట్మెంట్ స్కాం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ లో ఏఐ సొల్యూషన్స్ , ఏఐ రియాల్టీ,ఐఐటి క్యాపిటల్స్ పేరుతో పెట్టుబడిదారులను మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్డ ఈ సంస్థ పైన పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ సంస్థ దాదాపు 4500 మంది బాధితుల నుంచి 1000 కోట్ల పైచిలుకు వసూలు చేసి బిచాణాఎత్తేసింది. ఉభయ తెలుగు రెండు రాష్ట్రాల్లో కలిపి వేలాది మంది బాధితులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇవ్వడమే కాకుండా ఆరు శాతం వడ్డీ చొప్పున లెక్క కట్టి ఇస్తామంటూ భారీ ఎత్తున ప్రచారం చేసిన ఈ సంస్థ.. ఇందుకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో సమావేశాలు కూడా నిర్వహించింది.
పెద్ద సంఖ్యలో ఏజెంట్లను నియమించుకుంది. ప్రజలను ఆకర్షించి డిపాజిట్ల సేకరణ కోసం సమావేశాల పేర డిన్నర్ పార్టీలు కూడా ఇచ్చింది. తమకు చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయంటూ కొందరి చేత ఆ సమావేశాలలో చెప్పించి జనాలను నమ్మించింది. ఇలా ఆ సంస్థను నమ్మి వేలాది మంది బాధితులు పెట్టుబడులు పెట్టారు. ఇలా వేలాది మంది నుంచి దాదాపు వెయ్యికోట్లకు పైగా వసూలు చేసిన ఈ సంస్థ.. బిచాణా ఎత్తేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ సంస్థ 4600 మందికి పైగా బాధితుల నుంచి దాదాపు 1032 కోట్ల రూపాయలు వసూలు చేసిందనీ, ఆ సొమ్ములను చాలా వరకూ విదేశాలకు తరలించిందని గుర్తించారు.
స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడులు సురక్షితంగా ఉండటమే కాకుండా, అధికలాభాలు కూడా వస్తాయంటూ మభ్యపెట్టి డిపాజిటర్లను ఆకర్షించిన ఈ సంస్థ వారి నుంచి సేకరించిన సొమ్మును స్టాక్ మార్కెట్ లో పెట్టకుండా.. నకిలీ అక్కౌంట్లలోకి మళ్లించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏవి సొల్యూషన్స్ డైరెక్టర్ గడ్డం వేణుగోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీస్ ఎం.డి శ్రియస్ పాల్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏవి సొల్యూషన్స్కి అనుబంధంగా దాదాపు 10 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కంపెనీల ద్వారా దేశంలో సేకరించిన నిధులను విదేశా లకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.
ఏఐ సొల్యూషన్స్, శ్రీనివాస అనల్టిక్, ట్రేడ్బుల్ టెక్నాలజీ, ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీ పేర్లతో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించింది. ఈ సంస్థలు తమను బీఎస్ఈ, సెబీలో నమోదు అయిన కంపెనీలుగా ప్రచా రం చేసుకొని ప్రజలను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కంపెనీలు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.