Read more!

బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్​రెడ్డి! రేవంత్ రెడ్డికి మరో షాక్ 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్​బై చెప్పగా... తాజాగా మరో సీనియర్ నేత హ్యాండ్ ఇచ్చారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి కాంగ్రెస్​కు గుడ్ బై చెప్పేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కొండా పార్టీ మారడం కాంగ్రెస్ కు పెద్ద షాకే. త్వరలోనే కొండా విశ్వేశ్వర్​రెడ్డి  బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారని సమాచారం. 

కొండా విశ్వేశ్వర్​రెడ్డి తొలిసారి 2014 ఎన్నికల్లో టీఆర్​ఎస్​ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​పార్టీలో చేరారు. అప్పట్లో టీఆర్​ఎస్​ మంత్రి, కేసీఆర్​ కుమారుడు కేటీఆర్​తో విబేధాలు రావడం వల్లే కొండా పార్టీని వీడినట్టు వార్తలు వచ్చాయి. అయితే 2019లో నిర్వహించిన పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ టికెట్​ మీద చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్​రెడ్డి పోటీచేశారు. అయితే సల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి చాలా ఆయన కాంగ్రెస్​ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. యూట్యూబ్​లో వీడియోలు చేస్తూ వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్​తో దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్​ నేతలు, క్యాడర్​ చతికిల పడ్డారు. పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్​ కుమార్​రెడ్డి రాజీనామా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్​ అధిష్ఠానం ఆమోదించలేదు. కొత్త అధ్యక్షుడిని కూడా నియమించలేదు. దీంతో క్యాడర్​ తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు కాంగ్రెస్​ అధిష్ఠానం మాత్రం ఈ విషయంలో ఇంతవరకు స్పందించడం లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతలెవరు సీరియస్ గా పని చేయలేదు. దీంతో కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్ కష్టమనే భావనలో ఉన్న నేతలంతా.. ఆపార్టీ నుంచి బయటకి వస్తున్నారని చెబుతున్నారు.