జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్
posted on Jun 13, 2020 8:05AM
ఏపీలో నిన్న టీడీపీ నేత అచ్చన్నాయుడి అరెస్ట్ మరువక ముందే.. నేడు మరో ఇద్దరు టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డితో పాటు ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి తరలిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వారిద్దరిని కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చడం, నకిలీ ఎన్వోసీలు సృష్టించి ఏపీకి తరలించారన్న ఆరోపణలపై ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిని నకిలీ ఇన్సూరెన్స్ల వ్యవహారంలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వాహనాలకు ఇన్సూరెన్స్ చెల్లించకుండానే.. చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్న ఆరోపణల నేపథ్యంలో అస్మిత్రెడ్డి ని అరెస్ట్ చేసినట్లు సమాచారం.