Read more!

రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో ఈసీ తనిఖీ

దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల వేళ అభ్యర్థులు కట్టుతప్పకుండా ఎలక్షన్ కమిషన్ (ఈసీ) పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ హెలికాఫ్టర్‌పై ఈసీ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మైసూర్ నుంచి హెలికాఫ్టర్‌లో తమిళనాడులోని నీలగిరి జిల్లాకు వచ్చారు. రాహుల్ నీలగిరిలో దిగిన వెంటనే ఈసీ బృందం హెలికాఫ్టర్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. మరోవైపు, కేరళలో రాహుల్ గాంధీ తన ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. సుల్తాన్ బాథెరీలో ఓ భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకుమునుపు నీలగిరిలోని స్థానిక కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారు.

ఇక సుల్తాన్ బాథెరీలో రాహుల్ గాంధీ కారులో ప్రయాణిస్తూ ప్రచారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనను అనుసరించారు. నేటి పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ మనంథవాడి, వెల్లమండ, పదిన్‌జరతార ప్రాంతాల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. నేటి సాయంత్రం, కోజీకోడ్ జిల్లాలో కాంగ్రెస్-యూడీఎఫ్ కూటమి ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొంటారు. వయనాడ్ నుంచి మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్న రాహుల్‌కు అక్కడ ఇది రెండో పర్యటన. 2019 ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి రికార్డు స్థాయిలో 4,31,770 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న ఒకేసారి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాహుల్ తన ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు.