అత్తమీద కోపందుత్త మీద.. ఏపీలో డ్రైవింగ్ లైసెన్సులు డిజిటలైజేషన్.. వెనక కథ ఇదీ?!
posted on Aug 21, 2023 6:19AM
ఏపీలో వాహనదారులకు ఇకపై రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు కార్డు రూపంలో ఉండవు. సంబంధిత యాప్లో డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్లు సరిపోతాయి. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) కార్డుల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ఇకపై డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం చెల్లించాల్సిన ఛార్జీలను కూడా ఆపేసింది. లైసెన్సులు, ఆర్సీలకు ఇప్పటి వరకు కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఛార్జీలను కూడా వసూలు చేయడం లేదు. ఇకపై వాహనదారులు తమ మొబైల్స్లోనే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీని పోలీసులు, రవాణాశాఖ అధికారులకు చూపిస్తే సరిపోతుందని ప్రకటించింది.
ప్రస్తుతమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. లావాదేవీలతో పాటు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయని.. అందుకే భారత ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా ప్రాజెక్టును ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకువచ్చిందని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. వాహనదారులంతా మొబైల్లో ఏపీఆర్టీఏ సిటిజన్ యాప్ ద్వారా లైసెన్స్, ఆర్సీలను డౌన్లోడ్ చేసుకోని పెట్టుకొని అవసరమైనపుడు చూపిస్తే సరిపోతుందని ప్రకటించారు. అయితే, ఈ డిజిటలైజ్ చేయడం వెనక పెద్ద తతంగమే నడిచిందని ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుండి లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నిజానికి ఏపీ ప్రభుత్వం ఆర్టీఏ సర్వీసుల డిజిటలైజేష్ ప్రజలకు వెసులుబాటు కోసం చేసింది కాదనీ, లైసెన్సులు, ఆర్సీలకు కావాల్సిన ముడి సరుకు కొరతతోనే ఇందుకు ఉపక్రమించిందని అంటున్నారు. మొన్నటి వరకు లైసెన్సులు, ఆర్సీల కోసం వాహనదారుల నుండి కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇలా ఏడాది కాలంగా డబ్బులు చెల్లించిన ఎవరికీ ఈ కార్డులు పంపించలేదు. గత ఏడాది కాలంగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు కార్డు రూపంలో పంపిణీ చేయడానికి వాహనదారుల నుండి డబ్బులు తీసుకున్నారు కానీ, ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో డబ్బులు కట్టకపోవడంతో కార్డులు పంపాల్సిన వెండర్లు రవాణాశాఖకు పంపించలేదు. అప్పటికే పెండింగ్ బిల్లులు ఉండగా.. అవి క్లియర్ చేస్తేనే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం ఈ డిజిటల్ ఆలోచన చేసిందని చెబుతున్నారు. ఇకపై ఈ కార్డుల కోసం చెల్లించాల్సిన రూ.225 అవసరం లేదని చెప్తున్న రవాణా శాఖ.. గత ఏడాది కాలంగా ఈ డబ్బు చెల్లించిన వారికి కార్దులు పంపిస్తామని, అందుకు కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే, ఇక కార్దుల ఆశ వదులుకోవాల్సిందేనని ఆర్టీఏ ఏజెంట్లు చెప్తున్నారు.
అంత బాగానే ఉంది.. అందరూ తమ ఫోన్లలో యాప్ ఇంస్టాల్ చేసుకొని లైసెన్స్, ఆర్సీ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ, చదువు లేని వారు.. స్మార్ట్ ఫోన్ లేని వారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి వారంతా మీ సేవా, లేదా ఆన్ లైన్ సెంటర్ కి వెళ్లి తమ వివరాలతో పత్రాలు డౌన్ లోడ్ చేసి ఆ కాగితాలను తమ వద్ద ఉంచుకొని రవాణాశాఖ అధికారులకు చూపిస్తే సరిపోతుందని చెప్తున్నారు. మిగతా చాలా రాష్ట్రాలలో ఈ డిజిటల్ విధానం ఉన్నా.. కార్దులు కూడా జారీ చేస్తారు. కార్డులు దగ్గర ఉన్న వారు అవి చూపిస్తే మిగతా వారు డిజిటల్ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే, ఏపీలో మాత్రం ముందూ వెనకా చూడకుండా.. పర్యవసానాలేంటి అన్న ఆలోచన లేకుండా పూర్తిగా డిజిటల్ విధానం ఒక్కటే తీసుకొచ్చారు. ఇది కేవలం నిధులు చెల్లించకపోతే కార్దులు జారీ చేయడం కుదరదన్న వెండర్ల మీద కోపంతో తీసుకొచ్చిన విధానం మాత్రమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.