పదేళ్ల తెలుగు బాలికను సత్కరించిన ట్రంప్
posted on May 18, 2020 @ 12:35PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేళ్ల తెలుగు బాలిక శ్రావ్య అన్నపరెడ్డిని సత్కరించారు. గర్ల్స్ స్కౌట్ మెంబర్గా ఉన్న శ్రావ్య.. అమెరికాలో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలను కొనియాడుతూ, వారిలో ఉత్సహం నింపేలా వ్యక్తిగత కార్డులను పంపించింది. దీనిని గుర్తించిన ట్రంప్.. శ్రావ్యను ప్రశంసించారు. ఆమెతో పాటు లైలా ఖాన్, లారెన్ మాట్నీ అనే మరో ఇద్దరు బాలికలను కూడా ట్రంప్ సత్కరించారు.
మేరీల్యాండ్ ఎల్క్రిడ్జ్లోని ట్రూప్ 744లో ఈ ముగ్గురు బాలికలు సేవలు అందిస్తున్నారు. ఇటీవల వీరు 100 బాక్స్ల గర్ల్స్ స్కౌట్స్ కుకీస్ను స్థానిక అగ్నిమాపక, వైద్య సిబ్బందికి విరాళంగా ఇచ్చారు. దీంతో వారిని వైట్ హౌస్ కి ఆహ్వానించి, ట్రంప్ అభినందనలు తెలిపారు.
హనోవర్లో నివాసం ఉంటున్న శ్రావ్య.. ప్రస్తుతం నాలుగో గ్రేడ్ చదువుతోంది. శ్రావ్య తండ్రి విజయ్రెడ్డి ఫార్మాసిస్ట్గా పనిచేస్తున్నారు. ఆయనది గుంటూరు కాగా, శ్రావ్య తల్లి సీత స్వస్థలం బాపట్ల సమీపంలోని నరసయ్య పాలెం. తనకు దక్కిన గౌరవంపై శ్రావ్య స్పందిస్తూ.. ‘నా తల్లిదండ్రులు నాకు భారతీయ పద్ధతులు, సంస్కృతులను నేర్పుతూ పెంచారు. నేను వసుధైక కుటుంబం సిద్ధాంతాన్ని నమ్ముతాను’ అని చెప్పింది.