ప్రతి సంవత్సరం దోమల ద్వారా వ్యాపించే అతి పెద్ద మూడు వ్యాధులు ఇవే..!
posted on Aug 29, 2025 @ 11:56AM
వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై నుండి సెప్టెంబర్-అక్టోబర్ వరకు, డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల కారణంగా ఆసుపత్రులలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణుల అభిప్రాయం ప్రకారం, దోమ కాటు వల్ల కలిగే వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యాధులలో చాలా వాటికి నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. వైద్యులు లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఆ సమస్యకు ఉపశమనం కలిగేలా చేస్తారు.
డెంగ్యూ, చికున్గున్యా, జికా అనేవి మూడు ప్రమాదకరమైన వ్యాధులు. వీటికి ఇంకా శాశ్వత చికిత్స లేదా టీకా లేదు. అందుకే వైద్యులు ప్రజలందరూ నివారణ చర్యలు పాటించాలని సలహా ఇస్తూ ఉంటారు. ఈ వ్యాధులతో అతిపెద్ద సమస్య ఏమిటంటే.. ప్రారంభ లక్షణాలు సాధారణ జ్వరం లాగా ఉంటాయి. కానీ క్రమంగా అవి ప్రాణాంతక రూపాన్ని తీసుకువే అవకాశం ఉంటుంది.
డెంగ్యూలో ప్లేట్లెట్లు వేగంగా తగ్గుతాయి. ఇది తీవ్రమైన పరిస్థితులలో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. చికున్గున్యా నెలల తరబడి కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. అయితే జికా వైరస్ గర్భిణీ స్త్రీలు, పిల్లలకు జీవితాంతం ముప్పు కలిగిస్తుంది. అంటే, ఇవి కేవలం వ్యాధులు మాత్రమే కాదు, తీవ్రమైన ఆందోళన కలిగించే సమస్యలు. ఈ మూడింటికి ఖచ్చితమైన చికిత్స లేనందున, వైద్యులు లక్షణాలను మాత్రమే నియంత్రిస్తారు.
డెంగ్యూ ప్రమాదం..
డెంగ్యూ అనేది ఏడిస్ ఈజిప్టి అనే దోమ కాటు వల్ల వ్యాపించే వైరల్ వ్యాధి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. భారతదేశంలో వర్షాకాలంలో, వర్షం తర్వాత ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది.
డెంగ్యూ వచ్చిన రోగులకు అధిక జ్వరం, తలనొప్పి, కళ్ళ వెనుక, కండరాలు, కీళ్లలో నొప్పితో పాటు చర్మంపై ఎర్రటి దద్దుర్లు కూడా రావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో ఇది రక్తస్రావం జ్వరం లేదా డెంగ్యూ షాక్ సిండ్రోమ్కు కూడా కారణమవుతుంది. ఇందులో, ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా తగ్గుతుంది. ఇది శరీరంలో అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.
డెంగ్యూకు నిర్దిష్ట చికిత్స లేదు. దీని చికిత్సలో జ్వరాన్ని తగ్గించడం, ప్లేట్లెట్లు తగ్గకుండా నిరోధించడం, శరీరంలో నీటి కొరతను తీర్చడంపై మాత్రమే దృష్టి పెడతారు.
చికున్గున్యా ప్రభావం..
డెంగ్యూ లాగే చికున్గున్యా కూడా ప్రమాదకరమైనది. దీనికి ఖచ్చితమైన చికిత్స కూడా లేదు. చికున్గున్యా లక్షణాలు అకస్మాత్తుగా అధిక జ్వరం, తలనొప్పి, అలసట, చర్మంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు, వాపు. ఈ వ్యాధి తక్కువ ప్రాణాంతకం అయినప్పటికీ దీని వల్ల కలిగే అతిపెద్ద ప్రమాదం దీర్ఘకాలిక నొప్పి, బలహీనత. చాలా మంది రోగులు నెలల తరబడి నడవలేరు.
చికున్గున్యాకు ప్రత్యక్ష చికిత్స లేదా టీకా కూడా లేదు. రోగులకు నొప్పిని తగ్గించడానికి పారాసెటమాల్ ఇస్తుంటారు. విశ్రాంతి, తగినంత నీరు త్రాగడం పోషకమైన ఆహారం తినాలి.
జికా వైరస్..
జికా వైరస్ వ్యాప్తి గురించి చాలా వార్తు వస్తుంటాయి. ఇది ఏడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా, ఈ వ్యాధి తేలికపాటి జ్వరం, కళ్ళు ఎర్రబడటం (కండ్లకలక), తలనొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, కీళ్ల నొప్పులకు కారణమవుతుంది.
అయితే ఇది గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులకు చాలా ప్రమాదకరం. గర్భిణీ స్త్రీకి జికా వైరస్ వస్తే.. బిడ్డకు మైక్రోసెఫాలీ వంటి తీవ్రమైన పరిస్థితి రావచ్చని, దీనిలో పిల్లల తల, మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదని WHO నివేదికలు చూపిస్తున్నాయి.
జికాకు నిర్దిష్ట చికిత్స లేదా టీకా లేదు. రోగి లక్షణాలను తగ్గించే మందులు తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, తగినంత ద్రవాలు తీసుకోవడం మాత్రమే మార్గం.
ఈ మూడు వ్యాధుల నుండి నివారణ మాత్రమే ప్రభావవంతమైన మార్గం అని వైద్యులు అంటున్నారు. దీని కోసం దోమతెరలను ఉపయోగించడం,ఫుల్ హ్యాండ్స్ దుస్తులు ధరించడం, ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా ఉండటం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...