Read more!

ధర్మరాజ దశమి సందేశం!!

యముడు అంటే అందరికీ భయం. యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా. అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. భూలోకంలో మనుషులు ఎంత తప్పులు చేసినా, దేవుళ్లను పూజించి వాళ్ళ పాపాలు పోయేట్టు ప్రయత్నాలు చేసినా యముడి దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే. భూలోకంలో ధనిక, పేద వర్గాలు ఉన్నా ఆ యముడి దగ్గర అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్లిన జీవులే అవుతారు. అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించినవాడు లేడు. అందుకే యముడిని ధర్మరాజు అని కూడా పిలుస్తారు. 


ఏమిటీ ధర్మరాజ దశమి!!


చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే  మరణభయం తొలగిపోతుందని పెద్దలు, మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నచికేతుడి కథ వినడం ఈ ధర్మరాజ దశమి రోజు జరుగుతుంది. 


ఎవరు ఈ నచికేతుడు??


పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు. 


ఏమిటీ నచికేతుడి కథ!!


వజాశ్రవుడు ఒక యాగం చెయ్యాలి అనుకున్నాడు. ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలు అన్నీ దానం చేసేయ్యాలి. కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తనదగ్గరున్న ఆవులలో పలు ఇవ్వలేని, ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడు. అది నచికేతుడికి నచ్చలేదు "ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి?? ఒకపని చెయ్యండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి" అన్నాడు నచికేతుడు. 


కొడుకు ఏదో పిల్ల చేష్టతో అలా అంటున్నాడనుకుని నన్ను విసిగించద్దు అన్నాడు వాజశ్రవుడు.


అయినా కూడా నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చిరవరకు విసిగిపోయిన వాజశ్రవుడు "నిన్ను యముడికి ఇస్తాను" అన్నాడు. ఆ తరువాత తొందరపాటులో అన్నానని ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతాడు 


కానీ యాగం జరిగిన పవిత్ర స్థలంలో అన్నమాట జరగకుంటే మంచిదికాదని నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళాడు. యముడి దర్శనం తొందరగా దొరకలేదు. ఆ తరువాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక "మీ నాన్న ఏదో మాటవరుసకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్లిపో. నీకు మూడు వరాలు ఇస్తాను అన్నాడు.


నచికేతుడి మూడు వరాలు!!


యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మొదటగా 


1.నేను తిరిగి వెళ్తే మా నాన్న నామీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు.


తరువాత


స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పు. అంటాడు.


మూడవ కోరికగా 


మరణం తరువాత ఏమి జరుగుతుంది అని అడుగుతాడు.


మొదటి దానికి యముడు సరేనంటాడు.


రెండవదానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అనే పేరు పెడతాడు. (స్వర్గం అంటే భయం లేని స్థితి అంటారు ఇందులో)


మూడవ ప్రశ్నకు బదులుగా నువ్వు చిన్నవాడివి నీకు అవన్నీ తెలియవు, చెప్పినా అర్థం కావు అంటాడు యముడు. కానీ నచికేతుడు మొండిపట్టు పట్టడంతో  బ్రహ్మజ్ఞానం భోదిస్తాడు. అదే ఆత్మజ్ఞానంగా చెప్పబడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినవాడు మరణాన్ని గురించి తొణకడు.


ధర్మరాజ దశమి రోజు నచికేత యజ్ఞం చేసినవారికి మరణ భయం ఉండదనేది ఇందుకే. అందుకే ఈ ధర్మరాజ దశమి ఎంతో ప్రాముఖ్యం పొందింది.


స్వామి వివేకానంద అంటాడు. నచికేతుడి లాంటి పదిమంది శిష్యులను నాకు ఇస్తే ఈ దేశాన్ని మార్చేస్తాను అని. అంటే నచికేతుడు గుణంలోనూ, పట్టుదలలోనూ ఆలోచనల్లోనూ ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ప్రత్యేకంగా చెప్పాలా??

                                         ◆వెంకటేష్ పువ్వాడ.