కరోనా టైంలో కక్ష సాధింపు చర్యలా? జగన్ది పైశాచిక ఆనందం..
posted on Apr 23, 2021 @ 1:09PM
సీఎం జగన్పై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్షనేతలను తొక్కిపెడుతూ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ప్రజలంతా కరోనాతో బిక్కుబిక్కుమంటుంటే, ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఒక బందిపోటును, గూండాను అరెస్ట్ చేసినట్టు.. ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికెళ్లి ఆయన్ని అరెస్ట్ చేశారన్నారు. సంగం డెయిరీని స్థాపించి పాడిరైతులకు అండగా ఉండటమే నరేంద్ర చేసిన తప్పా? సంగం డెయిరీని రూ.1100కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లడమే నరేంద్ర చేసిన తప్పా? ప్రభుత్వం తప్పుడు కేసులను ఎత్తిచూపి, వాస్తవాలు బయటపెట్టడంతో, ముఖ్యమంత్రి ధూళిపాళ్లపై కక్ష కట్టారన్నారు దేవినేని ఉమా.
అమూల్ను భుజానికెత్తుకున్న ముఖ్యమంత్రి, నరేంద్రను టార్గెట్గా చేసుకున్నారని ఉమా ఆరోపించారు. సంగం డెయిరీలో లేని అవినీతిని ఉన్నట్టు చూపడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అక్రమ కేసులు, తప్పుడు కేసులతో ముఖ్యమంత్రి ఒక శాడిజంతో, పైశాచిక ఆనందంతో, సైకోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి భూముల వ్యవహరంలో చంద్రబాబునాయుడు, మాజీమంత్రి నారాయణలపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని నరేంద్ర ఆధారాలతో సహా నిరూపించారన్నారు. అందుకే నరేంద్రను సీఎం జగన్ టార్గెట్ చేశారన్నారు. నరేంద్రను తక్షణమే మీడియాసాక్షిగా కోర్టులో హాజరుపరచాలని, లేకుంటే టీడీపీ తరుపున పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యముంటే కరోనాతో బాధపడుతున్న రోగుల దగ్గరకు రావాలని, వైరస్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్ చేశారు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రినైనా ముఖ్యమంత్రి ఎందుకు సందర్శించడంలేదని, కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఎందుకు సమీక్ష చేయడంలేదని ప్రశ్నించారు దేవినేని ఉమా.