రాజేంద్రనగర్ లో పేలిన సిలిండర్... ఆరుగురు పరిస్థితి విషమం
posted on Dec 14, 2023 @ 2:46PM
హైదరాబాద్ రాజేంద్రనగర్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది స్పాట్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం ఈ బేకరీని హైదరాబాద్కు చెందిన విజయరాం, నాని అనే ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. దాదాపు 100 మంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజూలానే ఉదయం బేకరీ ఫుడ్ తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్ పైప్ లీక్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు బేకరీ మొత్తం వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది.