అమెరికా ఖజానా డేటా హ్యాక్! రష్యా కుట్రపై అనుమానాలు
posted on Dec 14, 2020 @ 10:42AM
అగ్రరాజ్యం అమెరికాపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. యూఎస్ ట్రెజరీ విభాగంలోని కంప్యూటర్ నెట్ వర్క్ ను రష్యా హ్యాకర్లు హ్యాక్ చేశారు. హ్యాకింగ్ జరిగిందనే విషయాన్ని యూఎస్ ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖజానా సమాచారం ఉన్న నెట్ వర్క్ పై సైబర్ ఎటాక్ జరిగిందని వెల్లడించింది. ప్రభుత్వ నెట్ వర్క్ పైజరిగిన దాడి కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఈ విషయంలో టెక్నాలజీ నిపుణులు సహకరిస్తున్నారని అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజన్సీ ప్రతినిధులు తెలిపారు.
హ్యాకింగ్ కు గురైన విభాగాలను పరిశీలిస్తున్నామని, హ్యాకర్లు స్వాధీనం చేసుకున్న నెట్ వర్క్ ను తిరిగి సరిదిద్దేందుకు సీఐఎస్ఏ సాంకేతిక సహకారాన్ని అందిస్తోందని అమెరికా ఆర్థికశాఖ అధికారులు చెప్పారు. అయితే ఈ సైబర్ దాడి గత వారం జరిగిందని 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. కస్టమర్ల కంప్యూటర్ సిస్టమ్స్ ను పరిశీలిస్తుండే టూల్స్ ను హ్యాకర్లు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.
మరోవైపు అమెరికా ఖజానా విభాగంపై పై జరిగిన సైబర్ దాడి రష్యా ప్రభుత్వం అండతోనే జరిగిందని యూఎస్ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కు చెందిన ఓ గ్రూప్ ఈ పని చేసుటుందని భావిస్తున్న ఎఫ్బీఐ, సైబర్ దాడిపై విచారణ ప్రారంభించింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇదే టీమ్ పలు ప్రభుత్వ ఏజన్సీల వెబ్ సైట్లపై దాడి చేసి, విలువైన సమాచారాన్ని దొంగిలించిందన్న ఆరోపణలు ఉన్నాయి.