తెలుగు ఐఏఎస్ అధికారులు పనికిరారా?
posted on Mar 2, 2014 @ 10:54AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి పదవీ కాలాన్ని పొడిగించడం మీద తెలుగు ఐఏఎస్ అధికారులు మండిపడుతున్నారు. ఇక్కడి కేడర్ లో సమర్థులైన అధికారులు కావల్సినంత మంది ఉండగా వేరే రాష్ట్రానికి చెందిన ఆయనకు పొడిగింపు ఇవ్వడం ఏమిటని సీసీఎల్ఏ ఐవైఆర్ కృష్ణారావు నిలదీశారు. విభజన సమయంలో స్థానిక కేడర్లో సమర్థులున్నా గుర్తించకపోవడం దారుణమని ఆయన ఆగ్రహించారు. సమర్థులైన అధికారులు లేనప్పుడు, ప్రతిభావంతులైన అధికారులకు మాత్రమే పదవీ కాలం పొడిగింపు ఇవ్వాలనే నిబంధన ఉందని, ఆ నిబంధనను తుంగలో తొక్కారని విమర్శించారు.
రాష్ట్రానికి చెందిన అధికారులు పనికిరారనే భావన వచ్చేలా, మహంతి పదవీ కాలం పొడిగించడం అఖిల భారత సర్వీసు అధికారులను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి శుక్రవారం ఐ.వై.ఆర్. ఘాటుగా లేఖ రాశారు. తెలుగు అధికారులను అవమానించేలా వ్యవహరించినందుకు నిరసనగా శనివారం నుంచి 10వ తేదీ వరకు పది రోజుల సెలవుపై వెళుతున్నట్లు సీఎస్కు రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు.
సీఎస్ మహంతి పదవీ కాలం పొడిగించడంపట్ల మిగతా తెలుగు ఐఏఎస్ అధికారులు కూడా భగ్గుమంటున్నారు. దీనిపై త్వరలో రాష్ట్రపతికి లేఖ రాయాలనే యోచనలో ఉన్నారు. చివరివరకు ఐ.వై.ఆర్. సీఎస్ అవుతారని భావించిన మిగతా ఐఏఎస్ అధికారులు కూడా చివరి నిముషంలో జరిగిన పరిణామాల పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇది రాష్ట్రానికి చెందిన ఐఏఎస్లందరినీ అవమానించడమేనని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శామ్యూల్ కూడా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.