మహారాష్ట్రలో కరోనా పంజా! ఐదు జిల్లాల్లో లాక్ డౌన్
posted on Feb 22, 2021 7:34AM
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పంజాబ్ లో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ మహారాష్ట్రపై పంజా విసురుతోంది. కేసులు పెరుగుతుండడంతో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్ జిల్లాలలో వారం రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం అర్ధ రాత్రి నుంచి మార్చి 1 వరకు లాక్ డాన్ అమల్లో ఉంటుంది.
పూణె, నాసిక్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. శుక్రవారం నాడు పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు. విద్యాసంస్థలను కూడా ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో గత రెండు వారాల్లో కేసులు 2 వేల 500 నుంచి ఏడు వేలకు పెరిగాయి. పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్ర వ్యాప్త లాక్డౌన్పై ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్డౌన్ వద్దనుకుంటే కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.