అక్టోబర్’లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
posted on Aug 29, 2022 8:00AM
చివరాఖరుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూలు ఖరారైంది. ఈ రోజు (ఆదివారం) జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సి డబ్ల్యూసీ) సమావేశంలో ముందుగా అనుకున్నట్లుగానీ, ఎన్నికల షెడ్యూలు ఖరారైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 22న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ తేదీని ఖరారు చేసేందుకు భేటీ అయిన సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 19న ఫలితాల ప్రకటన ఉంటుందని చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఎన్నికల షెడ్యూల్ను ఆమోదించారని వేణుగోపాల్ వివరించారు. సెప్టెంబర్ 24 నుంచి 30 మధ్య నామినేషన్లు సమర్పించవచ్చని వివరించారు. నామినేషన్లు సమర్పించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని స్పష్టం చేశారు.
సోనియా, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ అగ్రనేతలతో ఎన్నికల తేదీ ఖరారుతో పాటు పార్టీ చేపట్టదలచిన పలు కార్యక్రమాలపైనా సీడబ్ల్యూసీ చర్చించింది. ధరల పెరుగుదలను నిరసిస్తూ చేపట్టిన హల్లాబోల్ ర్యాలీని సెప్టెంబర్ 4న నిర్వహించనున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించనున్నట్లు వివరించింది. దీంతో పాటు, సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని సీడబ్ల్యూసీ ఆకాంక్షించింది.
ఎన్నికల తేదీ ఖరారు చేసేందుకు ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి.. సోనియా గాంధీ వర్చువల్గా హాజరయ్యారు. వైద్య పరీక్షల కోసం సోనియా విదేశాలకు వెళ్లారు. ఆమె వెంటే రాహుల్, ప్రియాంకా గాంధీలు వెళ్లారు. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి వర్చువల్గా భేటీకి హాజరయ్యారు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జీ23 నేత ఆనంద్ శర్మ, కాంగ్రెస్ ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ, కేసీ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, పీ చిదంబరం, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సహా పలువురు కీలక భేటీలో పాల్గొన్నారు.
అయితే, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ సందిగ్దత అలాగే, కొనసాగుతోంది. మరోవంక నెహ్రూ గాంధీ కుటుంబ వెలుపల వ్యక్తికి అధ్యక్ష పదవి అప్పగించేందుకు, రాహుల్ గాంధీ సుముఖంగా ఉన్నా, సోనియా గాంధీ మాత్రం పార్టీ పగ్గాలు ‘పరాయి’ చేతికి అప్పగించేందుకు సుముఖంగా లేరని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, దినదినప్రవర్తమనంగా దిగజారి పోతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సీనియర్ నాయకులు ఎవరైనా ముందుకు వస్తారా, అనేది అనుమానంగానే కనిపిస్తోందని అంటున్నారు.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికవ్వాలని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని పేర్కొన్నారు.'కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ నడిపించాలి.పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలి.కాంగ్రెస్ పార్టీని ఆయన ఏకం చేయగలరు. పార్టీని బలోపేతం చేసే సత్తా ఆయనకు ఉంది' అని ఖర్గే వ్యాఖ్యానించారు.