కాంగ్రెస్ అభ్యర్ధులపై వీడిన సస్పెన్స్
posted on Apr 6, 2011 @ 9:55AM
కడప: కడప లోక్సభకు, పులివెందుల అసెంబ్లీ స్థానానికి బలమైన అభ్యర్థులను పోటీకి దింపాలనేది కాంగ్రెసు అధిష్ఠానం స్థిర నిర్ణయం. అందుకే, కడప పార్లమెంటు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిపై వరదరాజులు రెడ్డిని పోటీకి దింపాలని కాంగ్రెసు పార్టీ ఆలోచన చేస్తోంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని కూడా వైయస్ జగన్పై పోటీకి పెట్టాలనే ఆలోచన సాగింది. అయితే, వరదరాజులు రెడ్డి వైపే కాంగ్రెసు నాయకత్వం మొగ్గు చూపింది. కాగా, పులివెందుల శాసనసభా నియోజక వర్గంలో వైయస్ విజయమ్మపై మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పోటీకి దిగుతున్నారు. ఆయన ఈ నెల 16వ తేదీన నామినేషన్ వేస్తారని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్లు కడప జిల్లా నేతలతో మంగళవారం రాత్రి సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. డీఎల్ రవీంద్రారెడ్డి, వరదరాజులరెడ్డి, తులసిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిల పేర్లపై చర్చ జరిగింది. చివరికి వరద పేరుపైనే ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఈ సమావేశంలో ఆయన లేకపోవడంతో బుధవారం ఆయనతో పాటు నేతలంతా మరోమారు భేటీ అయ్యాక తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. అనూహ్య పరిస్థితుల్లో కందుల రాజమోహనరెడ్డి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి అయినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయించారు.
వివేకా ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. కడప లోక్సభ స్థానంలోనూ గట్టి పోటీ ఇవ్వడం ద్వారా సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ లోక్సభ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కడప, మైదుకూరు, పులివెందులకు ముగ్గురు మంత్రులు అహ్మదుల్లా, డీఎల్, వివేకాలు ప్రాతినిధ్యం వహిస్తుండడం కాంగ్రెస్కు కలిసివస్తోంది.