ఇలా ప్రమాణ స్వీకారం.. అలా సీఎం రేవంత్ దూకుడు
posted on Dec 7, 2023 @ 2:58PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రమాణ స్వీకారం చేయగానే అలా పని మొదలెట్టేశారు. విపక్ష నేతగా ఆయన ఎంత దూకుడుగా వ్యవహరించారో, ముఖ్యమంత్రిగానూ అంతే వేగంగా కదులుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అలాగే ప్రిన్సిపల్ సక్రెటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ల మార్పు కూడా జరిగిపోయింది.
అలాగే తన కేబినెట్ సహచరులకు శాఖల కేటాయింపు కూడా జరిపేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయించారు.అలాగే తుమ్మలకు రోడ్లు భవనాల శాఖ, దామోదర రాజనరసింహకు ఆరోగ్య శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పురపాలక శాఖ కేటాయించారు. ఇక పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ కేటాయించగా, పొంగులేని శ్రీనివారరెడ్డికి నీటిపారుదల శాఖ కేటాయించారు.
అంతకు ముందు ప్రమాణ స్వీకారం పూర్తిగాకాగా ఆ కార్యక్రమానికి వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిందనీ,న ఇక సమానాభివృద్ధే లక్ష్యమని ఉద్ఘాటించారు. పోరాటాలు, త్యాగాల పునాదితో ఏర్పడిన తెలంగాణ గత దశాబ్ద కాలంగా నిరంకుశ పాలనలో మగ్గిపోయిందన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజా పాలన ఆరంభమైందని ప్రకటించారు. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించేశామనీ, ప్రగతి భవన్ ఇక నుంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అనీ ప్రకటించారు. ఆ ప్రజా భవన్ లో ప్రతి శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహిస్తామన్నారు. మే పాలకులం కామనీ, మీ సేవకులమనీ చెప్పారు. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తానన్నారు.
ఇక రేవంత్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారు అన్న నమ్మకాన్ని ప్రజలలో కలిగేలా ఆయన రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరుగ్యారంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఇక రెండో సంతకం.. ఆయన రజజనీ అనే దివ్యాంగురాలికి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. గతంలో దివ్యాంగురాలు రజనీకి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెకు ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశారు. దానిని గుర్తు ఉంచుకుని తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దివ్యాంగురాలైన ఆమె ఉన్నత చదువు పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో ఆమె గతంలో గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డిని కలిసి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ హామీని నెరవేర్చుకున్నారు. ఎక్కడా తాత్సారం లేకుండా చకచకా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూసి అధికారులు, సహచర మంత్రులే విస్తుపోతున్న పరిస్థితి. సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలనను పరుగులెత్తిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.