పలు అభివృద్ధి పనులకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినేట్ సమావేశంలో  44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత నిర్ణయాలను మంత్రి పార్థసారథి తెలిపారు. అమృత్ 2 లో భాగంగా 2026 మార్చి 31 కల్లా పెండింగ్ పనులు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసిందని.. అమృత్ 2లో భాగంగా 506 పెండింగ్ ప్రాజెక్టులను రూ.9,613 కోట్ల నిధులతో చేపట్టేందుకు మంత్రివర్గం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.163 కోట్లతో అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. 

ఎల్ 1 బిడ్లను ఆమోదించే బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలో E 3 రోడ్డు విస్తరణకు ఎల్ 1 బిడ్ ఆమోదానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎండీకి బాధ్యతలు అప్పగించామన్నారు.

గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్‍లుగా పదోన్నతికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.532 కోట్లతో సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధాన పనులకు ఆమోదం తెలిపింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యామ్ల నిర్వహణకు పరిపాలన అనుమతులు కల్పించింది.
 

మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం రికార్డు బ్రేక్... అత్యధిక ప్రేక్షకులు హాజరు

  ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్  రికార్డు బద్దలుకొట్టింది. బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు మ్యాచ్ వీక్షించడానికి 94,199 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు 93,013 మంది ప్రేక్షకులు వచ్చారు. ఈ రికార్డును ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ బ్రేక్ చేసింది. ఇదే ఇప్పటివరకు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నమోదైన అత్యధిక ప్రేక్షకుల రికార్డ్.  మొత్తంగా క్రికెట్ చరిత్రలో 2022 ఐపీఎల్ ఫైనల్‍ మ్యాచ్‌కు అత్యధిక మంది ప్రేక్షకులు హాజరయ్యారు.  ఆ క్రమంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ తన రికార్డు తానే బద్దలుకొట్టింది. యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఈ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌‌ను వీక్షించడానికి క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలిరోజు టెస్ట్ మ్యాచ్ వీక్షించడానికి ఏకంగా 94,199 మంది క్రికెట్ అభిమానులు వచ్చారు. దీంతో గ్రౌండ్‌లో స్టాండ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. అంతకుముందు ఈ మ్యాచ్‌కు 93,422 మంది ప్రేక్షకులు వచ్చినట్లు MCG గ్రౌండ్ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.  ఆ తర్వాత గంట వ్యవధిలోనే దాదాపు వెయ్యి మంది అభిమానులు పెరిగినట్లు ప్రకటించింది.కాగా, 2015 వరల్డ్ కప్ ఫైనల్‌‌లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ వీక్షించడానికి 93,013 మంది అభిమానులు వచ్చారు. ఆ రికార్డును ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్ట్ అధిగమించింది. ఇదే కాకుండా 2013లో జరిగిన బాక్సింగ్‌డే టెస్టుకు కూడా భారీ సంఖ్యలో (91,112 మంది) క్రికెట్ అభిమానులు తరలివచ్చారు.  MCG మొత్తం సామర్థ్యం 1,00,024. మరోవైపు, క్రికెట్ గ్రౌండ్లలో అత్యధిక మంది ప్రేక్షుకులు హాజరైన రికార్డ్ గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఉంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు ఏకంగా 1,01,566 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ స్టేడియం కెపాసిటీ 1,32,000. క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షుకులు వచ్చిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో సంచలన నమోదైంది. ఒకే రోజు 20 వికెట్లు నేలకూలాయి. ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. 42 పరుగుల వెనకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.   

2047 నాటికి ఇండియా సూపర్ పవర్.. ఏ శక్తీ అడ్డుకోలేదు.. చంద్రబాబు

భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్  ప్రారంభ సదస్సుకు చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి సోమవారం ( డిసెంబర్ 29) వరకూ తిరుపతి వేదికగా భారతీయ విజ్ణాన సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన చంద్రబిబు ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి సందర్శించారు.  పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వివిధ యుద్ద పరికరాల నమూనాలను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం సభను ప్రారంభించారు.  సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఏపీ సీఎం ప్రస్తుతించారు. ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందన్న ఆయన  ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పిందన్నారు.   భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు... మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్న  అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాలు 2 వేల ఏళ్ల క్రితం భారత దేశానికంటే ఎంతో వెనుకబడి ఉన్నాయన్నారు.రెండు వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేదనీ,  నాలెడ్జ్ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేదనీ వివరించారు.  2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.  సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇండియా చాంపియన్ అన్నారు.    ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతుని చెప్పిన చంద్రబాబు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని పురోగమిస్తోందన్నారు.  ఈ సందర్భంగా ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్, ప్రొఫెసర్ భారత్, డాక్టర్ సతీష్ రెడ్డి, సంస్కృత విద్యాపీఠం కులపతి జిఎస్ఆర్కే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

శ్రీవాణి దర్శనం టికెట్లు రద్దు.. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం

తిరుమలలో  భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవాణి దర్శన టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంటకేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి దేవదేవుడి దర్శనం కోసం నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సెలవుదినాలు, వారాంతాలలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలోనూ టీటీడీ శ్రీవాణి దర్శనం టికెట్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మామూలుగా ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది.  అయితే ఆన్ లైన్ లో పూర్తి అయిన శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన వారిని అనుమతించనుంది.  అంతే కాకుండా ఇక నుంచి ఆఫ్ లైన్ విధానాని రద్దు చేసి.. పూర్తిగా ఆన్ లైన్ విధానంలో దర్శన టిక్కెట్లు జారీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.  

జీహెచ్ఎంసీ.. దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. ఈ మేరకు హైదరాబాద్ మహానగర పాలనలో  తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులను చేసింది. ఈ మార్పుల మేరకు జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య ప్రస్తుతమున్న వాటికి రెట్టింపైంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)  లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు ,కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన తర్వాత, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.   దీంతో  2000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ హైదరాబాద్ మహానగరం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. డీలిమిటేషన్ లో భాగంగా   నగరంలో  జోన్లు , సర్కిళ్ల సంఖ్యను కూడా ప్రభుత్వం  పెంచింది. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, అలాగే 30 సర్కిళ్లను 60కి పెంచింది. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటయ్యాయి.  45 వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు, ప్రతి జోన్‌లో ఐదు సర్కిళ్లు ఉండేలా  అవసరమైన చర్యలు తీసుకుంది.  ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రజలు, రాజకీయ పార్టీల నుండి దాదాపు ఆరు వేల అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. వాటన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్న అనంతరం తుది నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇక పోతే ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనున్న సంగతి తెలిసిదే. ఈ లోపే వార్డుల పునర్విభజన , ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేసి, కొత్త వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  

కల్తీ మద్యం కేసులో నిందితులకు కస్టడీ

  నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏడుగురు నిందితులను కస్టడీ కోరుతూ తంబళ్లపల్లి కోర్టులో ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుగగా.. ఐదుగురు నిందితులను మూడు రోజులపాటు కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నిందితులు మదనపల్లె సబ్‌జైల్లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు అనుమతి మేరకు ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు, ఏ26 జగన్మోహన్ రావు, ఏ 28 తాండ్ర రమేష్, ఏ 27తిరుమల శెట్టి శ్రీనివాసరావు, ఏ 29 షేక్ అల్లబక్షులను శుక్రవారం (ఈ నెల 26) ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితులను ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు వారిని తరలించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

క్రికెట్‌లో సంచలనం... వైభవ్‌కు అరుదైన పురస్కారం

  బిహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌కు ఇప్పుడు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని న్యూఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ స్వీకరించాడు. పురస్కార ప్రదానోత్సవం అనంతరం, వైభవ్‌తో పాటు ఇతర అవార్డు గ్రహీతలు ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. దేశ యువతలో ప్రేరణ నింపే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్రికెట్ రంగంలో అద్భుత ప్రతిభను కనబరిచినందుకుగాను ఈ పురస్కారం వైభవ్‌కు దక్కింది. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అతడి కెరీర్‌లో ఓ చారిత్రక ఘట్టంగా నిలిచింది. అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా వైభవ్ విజయ్ హజారే ట్రోఫీ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఫీల్డ్‌లో ఆడే అవకాశం కోల్పోవడం ఏ ఆటగాడికైనా కష్టమే అయినా, దేశ స్థాయిలో గౌరవం అందుకోవడం జీవితంలో అరుదైన అవకాశం అని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో వైభవ్ చేసిన ప్రదర్శనతో రికార్డులు బద్దలయ్యాయి. కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి, బిహార్‌ను భారీ స్కోర్ దిశగా నడిపించాడు.  ఆ ఇన్నింగ్స్‌తో వైభవ్ దేశీయ క్రికెట్‌లో అత్యంత దూకుడు బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద రికార్డులు నెలకొల్పుతూ, భవిష్యత్ భారత క్రికెట్‌కు ఆశాజనకంగా మారాడు. సీనియర్ జట్టులోకి కూడా వైభవ్‌ను తీసుకోవాలనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అనేది 5 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఇచ్చే భారతదేశ అత్యున్నత పౌర గౌరవం. సాహసం, కళ - సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజి, సామాజిక సేవ, క్రీడల్లో ప్రతిభ చూపిన బాలలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తారు.  

ముగిసిన ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ

  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు విచారణ ముగిసింది. శుక్రవారం వేకువజామునే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ని విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో రాజకీయ ప్రత్యర్థులు, కీలక నేతలు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు తదితరుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అధికారిక అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ నిఘా సాగినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమా చారాన్ని రాజకీయ ప్రయో జనాల కోసం ఉపయోగిం చారన్న ఆరోపణలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. ఈ వ్యవహారంలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పాత్రపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఆయనను కస్టడీ లోకి తీసుకొని విచారించిన అధికారులు, పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.   ప్రభాకర్ రావు ను 14 రోజుల పాటు కస్టడీలకు తీసుకొని జరిపిన విచారణలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక వ్యవస్థ, ఆదేశాల పరంపర, ఎవరి అనుమతి తో నిఘా సాగిందన్న అంశాలపై సిట్ లోతైన విచారణ జరిపింది. ఈ కేసులో మరికొందరు ఉన్నతాధికా రుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారుల దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోని కీలక రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి రావడం ఈ కేసుకు మరింత రాజకీయ వేడి పెంచింది. ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు వంటి ప్రముఖ నేతల ఫోన్లు నిఘాకు గురయ్యాయా? అన్న కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తుల కమ్యూనికేషన్లపై కూడా నిఘా పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సాక్షిగా మారిన ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌ను సిట్ ఇప్పటికే రెండు సార్లు విచారించింది. ఆయన ఫోన్ సంభాషణలు, వివిధ రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలతో జరిగిన కమ్యూనికేషన్ల వివరాలను అధికారులు ఆయన ముందు ఉంచారు. గత ప్రభుత్వం నిఘా పెట్టిన కొద్ది మంది ముఖ్యుల్లో ఆరా మస్తాన్ ఒకరని సిట్ భావిస్తోంది.   రానున్న రోజుల్లో మరికొందరు కీలక వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతు న్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరి ఆదేశాలతో నిఘా సాగిందన్న అంశం తేలితే, రాజకీయంగా మరియు పరిపాలనా పరంగా ఈ కేసు సంచలనం గా మారే అవకాశముంది. ఫోన్ ట్యాపింగ్ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందన్న ఉత్కంఠ మధ్య, సిట్ విచారణపై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది.

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

  హైదరాబాద్ నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను పిల్లల ముందే పెట్రోల్‌ పోసి తగలబెట్టిన భర్త, అడ్డుకోవడానికి ప్రయత్నించిన కూతురిని కూడా మంటల్లోకి తోసి పారిపోయాడు. నల్గొండ జిల్లాకు చెందిన వెంకటేష్‌–త్రివేణి దంపతులు ప్రేమ వివాహం చేసుకుని నల్లకుంటలో తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. భర్త వెంకటేష్‌ అనుమానంతో వేధిస్తున్నాడని త్రివేణి ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక నుంచి మారతానని నమ్మించి కొద్ది రోజుల క్రితమే వెంకటేష్ ఆమెను తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అయితే, అనుమానం మళ్లీ తలెత్తడంతో వెంకటేష్ త్రివేణిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురిని కూడా మంటల్లోకి తోసివేయడంతో తీవ్ర కలకలం రేగింది. బాధితుల అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే త్రివేణి మృతి చెందగా, కూతురు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.  

కెనడాలో దారుణం... భారతీయ విద్యార్థి కాల్చివేత

  కలల దేశం కెనడాలో భారతీయ విద్యార్థుల నెత్తురు మరోసారి చిందింది. హిమాన్షి ఖురానా అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైన విషాదం నుంచి కోలుకోకముందే.. టొరంటో యూనివర్సిటీ సాక్షిగా మరో ఘోరం జరిగింది. 20 ఏళ్ల భారతీయ విద్యార్థి శివాంక్ అవస్థీని గుర్తు తెలియని దుండగుడు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పట్టపగలే పారిపోయారు. యూనివర్సిటీ ప్రాంగణానికి కూతవేటు దూరంలోనే ఈ కాల్పులు జరగడం అక్కడి ప్రవాస భారతీయులను, ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని వణికేలా చేస్తోంది. కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులపై దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి.  తాజాగా టొరంటోలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. 20 ఏళ్ల శివాంక్ అవస్థీ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు టొరంటో విశ్వవిద్యాలయం సమీపంలోనే కాల్చి చంపారు. హిమాన్షి ఖురానా అనే మరో భారతీయ విద్యార్థిని హత్య జరిగిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం అక్కడి ప్రవాస భారతీయులను, విద్యార్థి లోకాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. 20 ఏళ్ల వయసు కల్గిన శివాంక్ అవస్థీ టొరంటో విశ్వవిద్యాలయం సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘాతుకం జరిగింది.  దుండగుడు అతి సమీపం నుంచి శివాంక్‌పై కాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న శివాంక్‌ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పారామెడిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితులు కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుండి చాకచక్యంగా పరారయ్యారు. కెనడాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.  కొద్ది రోజుల క్రితమే హిమాన్షి ఖురానా అనే విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది. ఆ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగానే.. ఇప్పుడు శివాంక్ అవస్థీ బలికావడం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. కాల్పులు జరిగిన ప్రదేశం విశ్వవిద్యాలయానికి చాలా దగ్గరగా ఉండటంతో విద్యార్థులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ హత్యపై టొరంటో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

బీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో నేడు కేసీఆర్ సమావేశం

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో సమావేశమవనున్నారు.  పాలమూరు-రంగారెడ్డి పథకంపై కేసీఆర్ చర్చించానున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించి పనులు దాదాపు పూర్తి స్థాయికి తీసుకొచ్చినా, ప్రస్తుత రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు.  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం ప్రభుత్వం తిరస్కరించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని ఈ విషయాన్ని ఎండగట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.