చీరాల ఫలితంపై వివాదం: అభ్యర్థి ఆందోళన
posted on May 17, 2014 @ 2:53PM
ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా రంగంలో వున్న ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వున్న ఆమంచి మీద అనేక అవినీతి ఆరోపణలున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆమంచి ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలోనూ చేరకుండా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి పోతుల సునీతపై విజయం సాధించారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ విజయంపై ఇప్పుడు వివాదాలు మూగాయి. ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పద్మజకు లంచం ఇచ్చారని, నియోజకవర్గానికి చెందిన 60 ఈవీఎంలను తారుమారు చేసి ఫలితం తనకు అనుకూలంగా వచ్చేలా చేశారని ఈ స్థానం నుంచి ఓడిపోయిన తెలుగుదేశం అభ్యర్థి పోతుల సునీత ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేసి తీరాలంటూ ఆమె నిరసన దీక్ష చేపట్టారు. ఇది రాష్ట్ర రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో, ఎలా న్యాయం చేస్తుందో చూడాలి.