ఇంటి అప్పు తీర్చిన అభయప్రదాత.. బాబు

చంద్ర‌బాబు ఫించ‌న్ పంపీణీ   కార్య‌క్ర‌మంతో స్వయంగా పాలుపంచుకుని లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి అందజేస్తున్న చంద్రబాబు.. ఆ సందర్భంగా వారి కష్టాలను వింటున్నారు. వాటిని తీర్చడానికి తన వంతు సహాయం చేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు.   ఆయ‌న ఏ ఇంటికి ఆ ఒక‌టో తారీఖున వెళ్తారో ఆ ఇంటి వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైపోయినట్లే అనడంలో సందేహం లేదు.  కొండకొచో వారి జీవిత కాల సమస్యలకు కూడా చిటికెలో పరిష్కరించేస్తున్నారు. 
గతంలో అంటే వైసీపీ హయాంలో వాలంటీర్లు తెల్లవారకుండానే తలుపుతట్టి మరీ పింఛన్లు అందజేసేవారిని జగన్ సర్కార్ గప్పాలు కొట్టుకునేది.  అది ఏ మేరకు వాస్తవమో తెలియదు కానీ, పింఛన్లలోనూ ముడుపులు దండుకునే వారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

సరే అది పక్కన పెడితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ జనానికి ముఖం చూపిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ఏ బటన్ నొక్కుడు కార్యక్రమానికో రోడ్డు కిరువైపులా పరదాలు కట్టి సభా స్థలికి వచ్చే ఆయన ప్రసంగాలు చేసే వారే కానీ ప్రజల వినతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయన నిత్యం ప్రజలతో మమేకమౌతున్నారు. వారి సమస్యలు వింటున్నారు. పరిష్కరిస్తున్నారు. స్వయంగా ఆయన ఒక లబ్ధిదారు ఇంటికి వెళ్లి మరీ పింఛను అందిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 1) ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో నాగలక్ష్మి అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పింఛను అందజేశారు. వారి యోగక్షేమాలు విచారించారు. సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు.  ఆ ఇంట్లో చ‌దువుకుంటున్న యువ‌కుడు, చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేసిన యువ‌తికి సంబందించిన వివ‌రాలను తెలుసుకుని,  ఆ యువ‌కుడికి టీసీఎస్ లో జాబ్ కోసం సిఫారసు చేస్తానన్నారు. అలాగే  చ‌దువు ఆపేసిన  యువ‌తిని హైబ్రిడ్ ప‌ద్ధ‌తిలో తిరిగి ఎలా చ‌దువుకోవాలో సూచించారు.

ఇక ల‌బ్దిదారు నాగ‌ల‌క్ష్మికి సంజీవ‌నీ ప‌థ‌కం ద్వారా ఎలాంటి ఆహారం అందించాలో సూచించారు. అక్కడితో ఆగలేదు.. నాగలక్ష్మి ఇంటి నిర్మాణం కోసం ఎంత ఖర్చు అవుతుందో ఆరా తీసి.. వారికి ఉన్న అప్పు ఎంతో తెలుసుకుని ఆ మొత్తాన్ని తీర్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడికక్కడే కలెక్టర్ ను ఆదేశించారు. దీంతో నాగలక్ష్మి కుటుంబం అప్పు మొత్తం తీరిపోయింది. సమస్యలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో, ప్రజా నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు ఆచరణలో చూపుతున్నారంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి

  హైదరాబాద్ నగరంలోని కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ ప్రాంతంలో జరిగిన విషాదకరమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ గేటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్‌లో పడి అర్జున్ కుమార్ (3) అనే మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన పలువురి కంటతడి పట్టించింది. హైదర్‌నగర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న అర్జున్ కుమార్ అనే బాలుడు ఈరోజు ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన తల్లిదండ్రుల సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఈత కొలను వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.  ఆ సమయం లో స్విమ్మింగ్ పూల్ వద్ద ఎవరు లేరు..కొంతసేపటి తర్వాత బాలుడు కనిపిం చకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు స్విమ్మింగ్ పూల్‌లో బాలుడు నీటిలో మునిగిపోయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతడిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో అర్జున్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపో యారు. ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనతో కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. గేటెడ్ కమ్యూనిటీలో చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈత కొలను ప్రాంతంలో తగిన పర్యవేక్షణ లేకపోవడం, సేఫ్టీ ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నదని గ్రేటర్ కమ్యూనిటీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.  సమాచారం అందుకున్న వెంటనే కె.పి.హెచ్.బి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈత కొలను వద్ద భద్రతా నిబంధనలు పాటించారా? పర్యవేక్షణ లోపం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఈ విషాద ఘటన గేటెడ్ కమ్యూనిటీల్లో చిన్నారుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్విమ్మింగ్ పూల్‌ల వద్ద తగిన రక్షణ చర్యలు, పర్యవేక్షణ తప్పనిసరి అన్న విషయం ఈ ఘటనతో స్పష్టమవుతోంది.

మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత

  చంద్ర గ్రహణం కారణంగా మార్చి 03న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 10 గంటలకు పైగా మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 03 ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు క్లోజ్ చేయనున్నాట్లు తెలిపింది. గ్రహణమాసానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆచారం.   మార్చి 03న రాత్రి 8:30 గంటల తర్వాత శుద్ధి మరియు ఇతర శుద్ధి కర్మల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా, ఆ భక్తులపై అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలకర సేవను టిటిడి రద్దు చేసింది. భక్తులు గమనించాలని టీటీడీ కోరింది  

చట్ట విరుద్దమైన పోస్టులపై ‘ఎక్స్’ కీలక నిర్ణయం

   ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ కంటెంట్ గురించి కీలక ప్రకటన చేసింది. 'ఎక్స్‌'లో పోస్ట్ చేసే చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని, అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసిన అకౌంట్లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని వెల్లడించింది. అందుకోసం అవసరమైతే స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 'ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్' ఖాతా ద్వారా ఈ ప్రకటన వెలువడింది.  తమ ఏఐ ప్లాట్‌ఫామ్ 'గ్రోక్‌'ను ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను సృష్టించిన వారిపై, వాటిని నేరుగా అప్‌లోడ్ చేసిన వారిపై ఒకే రకమైన చర్యలు తీసుకుంటామని ఎలన్ మస్క్ హెచ్చరించారు. మస్క్ ప్రకటన అనంతరం 'ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్' కూడా అదే తరహా ప్రకటన చేసింది. 'ఎక్స్' నియమాలకు సంబంధించిన ఒక లింక్‌ను కూడా షేర్ చేసింది.  స్థానిక చట్టాలకు, నియమాలకు విరుద్ధంగా అశ్లీల, అసభ్య కంటెంట్ పెరుగుతున్నట్టు భారత ప్రభుత్వం గుర్తించి 'ఎక్స్‌'కు జనవరి రెండో తేదీన నోటీసులు జారీ చేసింది. 'గ్రోక్' ఉపయోగించి మహిళల అసభ్యకర చిత్రాలు సృష్టించి 'ఎక్స్‌'లో పోస్ట్‌లు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 'గ్రోక్' ఉపయోగించి రూపొందించిన అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని, ఈ మొత్తం ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 'ఎక్స్' తగిన చర్యలు చేపట్టింది.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ. 21 కోట్ల విలువైన కోకైన్ సీజ్

  మాదకద్రవ్యాలను పూర్తిగా రూపుమాపేందుకు అన్ని శాఖల అధికారులు ఉక్కు పాదం మోపుతున్న కూడా కొందరు స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో కొత్త కొత్త పద్ధతుల్లో డ్రగ్స్ ని రవాణా చేసేందుకు ప్రయత్నం చేస్తూ అధికారుల చేతికి చిక్కు తున్నారు...ఢిల్లీ అంతర్జా తీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చేతికి ముగ్గురు కేటుగాళ్లు దొరికారు. వారి వద్ద నుండి సుమారు రూ.21 కోట్ల విలువ చేసే 2.1 కిలోల కోకైన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడిన ముగ్గురు కేటుగాళ్లు కోకైన్‌ను అత్యంత పకడ్బందీగా సిలర్ కవర్‌లో చుట్టి, దానిపై మరలా పాలితిన్ కవర్లతో ప్యాకింగ్ చేసి ట్రాలీ బ్యాగ్‌లో దాచారు. స్కానింగ్‌కు చిక్కకుండా ఉండేందుకు అత్యాధునిక పద్ధతులు ఉపయోగించారు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకుని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులు గ్రీన్ చానల్ దాటే క్రమంలో అనుమా నాస్పదంగా ప్రవర్తించడంతో కస్టమ్స్ అధికారులు వారిని ఆపి తనిఖీ చేపట్టారు. ట్రాలీ బ్యాగ్‌లను స్కానింగ్ మిషన్‌లో పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లుగా స్పష్టమైంది. వెంటనే బ్యాగ్‌లను తెరిచి పరిశీలించగా భారీ మొత్తం లో కోకైన్ బయటపడింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు, వారి నుంచి మొత్తం 2.1 కిలోల కోకైన్‌ను సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ డ్రగ్స్ వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా, దేశంలో సరఫరా చేయాల్సిన నెట్‌వర్క్‌పై లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇటీవలి కాలంలో విమానాశ్రయాల ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతుండటంపై కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా ఉండి, నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాముతో హల్‌చల్

  హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఓ ఆటో డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపగా, అతడి చర్యలు ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీశాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే చంద్రాయణ గుట్ట చౌరస్తా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానా స్పదంగా ఆటో నడుపు తున్న డ్రైవర్‌ను ఆపి బ్రెత్ అనలైజర్‌తో పరీక్షించగా, అతడికి డ్రంకన్ డ్రైవ్‌లో 150 వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.  దీంతో డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే, కేసు నమోదు అనంతరం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆటో డ్రైవర్, అకస్మాత్తుగా తన ఆటోలో నుంచి పామును బయటకు తీసి ట్రాఫిక్ పోలీసులను బెదిరించాడు. అంతేకాకుండా పామును పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ నానా హల్చల్ సృష్టించాడు. ఈ అనూహ్య ఘటనతో చెక్‌పోస్ట్ వద్ద ఉన్న పోలీసులు, వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాము కనిపిం చడంతో  వెంటనే పోలీసులు అప్రమత్తమై డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆలోపే అతడు పాముతో పాటు ఆటోను తీసుకుని సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన కారణంగా కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు చెక్‌పోస్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ... డ్రంక్ డ్రైవింగ్‌కు తోడు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించిన కేసులో ఆటో డ్రైవర్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  పరారైన డ్రైవర్‌ను గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రమాదాలకు దారి తీసే డ్రంక్ డ్రైవింగ్‌పై పోలీసులు ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి ఘటనలు ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా బాధ్యతగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు.  

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో... సిట్ విచారణకు ఎమ్మెల్సీ నవీన్‌ రావు

  ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రైవేట్ డివైస్‌తో ఫోన్ ట్యాపింగ్‌ చేపించినట్లు నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (ఆదివారం) ఉదయం 11 గంటలకు నవీన్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పొలిటికల్ లీడర్లను సిట్ అధికారులు విచారించనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలను సైతం విచారించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్న నవీన్‌ రావుకు 2019లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్

    భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ప్రయాణించారు. ఈ ఏడాది జూన్ 26న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది రాకపోకలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాన్ని అత్యంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. గతంలో విశాఖను వణికించిన హుద్‌హుద్ తుఫాను సమయంలో గాలులు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచాయి.  దీనిని దృష్టిలో ఉంచుకుని భోగాపురం విమానాశ్రయ టెర్మినల్, ఇతర భవనాలను గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను కూడా తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించినట్లు జీఎంఆర్  సంస్థ తెలిపింది. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పెద్ద విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే సౌకర్యం ఉందని పేర్కొంది. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.  

నాచారం‌లో దారుణ హత్య... వివాహేతర సంబంధమే కారణం

  మూడు ముళ్లు, ఏడడు గులు.. వేదమంత్రాలతో వివాహబంధం ముడి పడుతుంది.  అంతటి పవిత్రమైన బంధాన్ని కొందరు ఇల్లాలు ప్రియుడి మోజులో పడి  అవమానిస్తున్నారు. ప్రియుడి కోసం భర్తను చంపి జైలు పాలు అవుతున్నారు. ఇటువంటి ఘటనే హైదరాబాద్‌ నగర శివార్లలోని నాచారం ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తు న్నాడనే కారణంతో భార్యే భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘాతుకానికి భార్యతో పాటు ఆమె వివాహేతరుడు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒడిశాకు చెందిన నారాయణ్‌ బెహరా  తన భార్య బంధిత బెహరాతో కలిసి జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి నాచారం మల్లాపూర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ.. నారాయణ్‌ బెహరా ప్లంబర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. భార్య బంధిత బెహరా గృహిణిగా ఉండేది. అయితే అదే ఇంట్లో అద్దెకుంటున్న విద్యాసా గర్‌తో బంధితకు గత నాలుగు నెలలుగా వివా హేతర సంబంధం కొనసాగుతున్నది. ఈ విషయం కాస్త భర్త నారాయణ్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయినా కూడా భార్య బంధిత ప్రవర్తన లో మార్పు రాలేదు సరి కదా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది.  ఈ క్రమం లో తమ సంబంధానికి నారాయణ్‌ అడ్డుగా మారడాన్ని భావించిన బంధిత, తన ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నింది. పథకం ప్రకారము భార్య బంధిత తన ప్రియుడితో కలిసి భర్తను నారాయణ్‌పై  రాడ్డుతో దాడి చేసి హత్య చేసింది. హత్య జరిగిన అనంతరం మృతుడి బంధువులు నాచారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు భార్య బంధిత పై అనుమానం రావడంతో మృతుడి భార్య బంధితను విచారించగా, ఆమె నేరాన్ని ఒప్పుకున్నది. '' ఆమె ఇచ్చిన సమాచారంతో పాటు సాంకేతిక ఆధారాల సహాయంతో ప్రియుడు విద్యాసాగర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన 24 గంటల లోపే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు నాచారం పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధాల వల్ల కుటుం బాలు విచ్ఛిన్నమవుతు న్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. ఈ కేసు నాచారం ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మూగజీవాల రక్తం అక్రమ సేకరణ చేస్తున్న ముఠా గుట్టు రట్టు

  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ సంచలనంగా మారింది. రహస్యంగా మేకలు, గొర్రెల వంటి మూగజీవాల రక్తాన్ని అక్రమంగా సేకరించి, బయటకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మటన్ షాప్‌ను కేంద్రంగా చేసుకుని మూగజీవాల నుంచి అడ్డగోలుగా రక్తం సేకరిస్తూ, దాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు  విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించి... మటన్ షాప్ యాజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి  180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.  ఈ రక్తాన్ని ప్లేట్‌లెట్స్ తయారీతో పాటు కొన్ని వ్యాధులను నయం చేస్తామని నమ్మబలికి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే సరైన వైద్య ప్రమాణాలు, అనుమ తులు లేకుండా ఇలా రక్తం సేకరించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం తీసుకోవడం వల్ల అవి ఒక రోజు తర్వాత మృత్యువాత పడుతున్నాయని జంతు హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇది మూగజీవాలపై అమానుష చర్యగా పేర్కొంటూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరిదైనా ప్రమేయం ఉందా? ఈ రక్తం ఎక్కడికి తరలించేవారు? ఎవరికెవరికీ సరఫరా చేసేవారు? అన్న కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ రక్త వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.ఈ ఘటనతో నాగారం సత్యనారాయణ కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. మూగజీవాల రక్షణకు కఠిన చర్యలు అవసరమన్న డిమాండ్ మరింత బలపడుతోంది.